అసహనం, దుర్వ్యాఖ్యలు ఒకే నాణేనికి రెండు ముఖాలు

15 Jul, 2018 02:12 IST|Sakshi

సందర్భం

రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అయితేనేమి, ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యాలకు పురిగొల్పే ఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరాబాద్‌ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్‌ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్‌ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అవి తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరుకునే నాయకుడు ఆయన. నేడు ప్రశాంత హైదరాబాద్‌ మహానగరంగా మరోసారి నిలబడింది.

వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాదులు, సమస్త శాస్త్రాలు  మను షుల్ని చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించాలి. శాస్త్ర విజ్ఞానం పెరిగి ఆకాశం ఆవలి దిక్కు  గుట్టు విప్పుతున్న వేళ అంధ విశ్వాస్వాలు చెలరేగి మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తున్నాయి. మత విశ్వాసాల పేరుతో హత్యలకు, దాడు లకు, ధర్నాలకు, బంద్‌లకు పూనుకో వటం ఎంత దౌర్భాగ్యం.lభారత జను లది వైవిధ్యభరిత జీవన విధానం.

ఆసేతు హిమాచల భారతావ నిలో భిన్న జాతులు, విభిన్న భాషలు, భావోద్వేగాలు, సంస్కృ తులు, ఆచారాలు, అవసరాలు ఉంటాయి. ఇంతటి జీవన వైవి« ద్యం ప్రపంచంలో మరే దేశంలో కన్పించదు. ఈ దేశంపై బయటి వారి దండయాత్రలు, అంతర్యుద్ధాలు శతాబ్దాల ఏలుబడిలో ఎక్కడి ఆచారాలు అక్కడ స్థిరపడిపోయాయి. అందుకే మతాలు, సంస్కృతులమధ్య అంతరాలు అనుబంధాలు ఏర్పడ్డాయి. భిన్న త్వంలో ఏకత్వమే లౌకిక భారత బలం.

రోజు రోజుకు దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో చూశాను.‘మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ ముఖాన బొట్టు, మెడలో మంగళసూత్రం, నల్లపూసల గొలుసు,  కాళ్లకు మెట్టెలు... ఇవి అన్ని ఓ మతంలో భాగమే... ఆ మతాన్ని గురించి మాట్లాడకపోతే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు, నల్లపూసలు, బొట్టు, మెట్టెలు తీసేయండి’ అని పోస్టులు పెట్టారు. మతం అనేది ఒక విశ్వాసం. ఎవరి విశ్వాసాలు వాళ్లకు, ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి. మతోన్మాద శక్తులు మతం అంటే  జీవన విధానం అనే దగుల్భాజీ మాటలను తెర మీదకు తెచ్చారు. వీళ్లే దేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం తాగా లనే ఆహారపు అలవాట్లను  నిర్దేశిస్తున్నారు. కట్టు, బొట్టు లాంటి  సంస్కృతి, సాంప్రదాయాలను, నియంత్రించేందుకు భౌతిక దాడులకు దిగుతున్నారు.

గోరక్షణ పేరుతో మనుషులను పాశవి కంగా చంపేస్తున్నారు. అది తప్పు అన్న బుద్ధి జీవులను నిర్ధాక్షి ణ్యంగా చంపించేస్తున్నారు. 2015 ఫిబ్రవరి 16న మహారాష్ట్ర వామపక్షవాది గోవింద్‌ పన్సారేను హత్య చేశారు. అదే ఏడాది ఆగస్టు 30న కన్నడ సాహితీవేత్త ఎంఎం కాల్బుర్గి(77)ని, 2017 సెప్టెంబర్‌ 5న బెంగళూరులోని తన ఇంటి ఆవరణలో సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌(55)ను దుండగులు కాల్చి చంపారు. ఈ ముఠా హిట్‌ లిస్ట్‌లో జ్ఞానపీఠ్‌ గ్రహీత గిరీశ్‌ కర్నాడ్, కన్నడ రచ యిత ప్రొఫెసర్‌ కెఎస్‌ భగవాన్, సాహితీవేత్త బిటి లలితా నాయక్, నిడు మామిడి మఠం స్వామీజీ వీరభద్ర చెన్నమళ్లస్వామి, హేతు వాది సీఎస్‌ ద్వారకానాథ్‌ ఉన్నట్టు బయటపడింది.

తెలంగాణ సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరి త్రను కలిగిన ప్రాంతం.. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులు, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జాహీ రాజ వంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉప ఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవి ర్భవించింది. కళలు, సంస్కృతులపై ఆసక్తికలిగిన అప్పటి, ఇప్పటి  పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృ తిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.

బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్‌–ఉన్‌–నబి, రంజాన్‌ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్‌ ఫెస్టివల్‌ వంటి ఇతర వేడుక లను కూడా జరుపుకుంటారు. విభిన్న భాషలు, సంస్కృతులకు తెలంగాణ రాష్ట్రం చాలాకాలం నుండి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. ‘దక్షిణానికి ఉత్తరం. ఉత్తరానికి దక్షిణం’గా, ‘గంగా– యమున తెహజీబ్‌’గా పిలవబడుతున్న తెలంగాణ రాష్ట్ర రాజ ధాని హైదరాబాద్‌ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నగరం. హిందూ, ముస్లిం, సిక్కు,  పార్శి, మరాఠి సర్వ జనుల సంగమ విశ్వనగరం ఇది.

రాముని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన  వ్యక్తి అయితేనేమి , ‘ధర్మాగ్రహ యాత్ర’ పేరుతో మత వైషమ్యా లకు పురిగొల్పేlఆధ్యాత్మిక గురువు అయితేనేమి, వాళ్లను హైదరా బాద్‌ నగరం విధ్వంసకర శక్తులుగానే చూస్తుంది. విశ్వనగరంలో మతం చిచ్చుపెట్టే వాళ్లను ఉపేక్షించేది లేదని కేసీఆర్‌ మరోసారి రుజువు చేశారు. చట్టం తనపని తాను చేసుకుపోయింది. కేసీఆర్‌ ఆది నుంచి సనాతన ధార్మికుడు. ఆధ్యాత్మిక ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని, అది తెలంగాణ సౌభాగ్యానికి పాటుపడాలని కోరు కునే నాయకుడు ఆయన. రాజ్యం బాగుండాల, రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలనే ఆకాంక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 1221 మంది పండితులను పిలిచి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో అయుత చండీమహాయాగం చేశారు. ఈ క్రతువులో 20 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వాములు అయ్యారు. శిధిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను పునః నిర్మాణం చేసి పూర్వ వైభవం తెచ్చారు. సర్వ మతాల ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ  ఎన్నో మజీదులను, చర్చిలను పునః నిర్మాణం చేశారు.

ఇక్కడో ఉదాహరణ. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సేనను తయారు చేసుకోవాల్సి వచ్చింది. అది తయారుచేసి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, అత్యాచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీయే ఐనా అందుకు తన పోలీసులతో, పాలనతో ప్రోత్సహించినవారు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. ఆ బలమే లేకపోతే హైదరాబాద్‌ నగరంలో షోయ బుల్లాఖాన్‌ వంటి పత్రికా సంపాదకుణ్ని బర్కత్‌పురాలో రజాకార్లు చంపగలిగేవాళ్లు కాదు. రజాకార్లు విద్వేషాలు రెచ్చగొట్టారనేది స్పష్టం. నిజాం వాళ్ళను పెంచి పోషించాడన్నదీ çసుస్పష్టం. దీన్ని వ్యతిరేకిస్తూ  తెలంగాణలో భీంరెడ్డి నర్సింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటి యువ నేతలు ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. అదే తెలం గాణ సాయుధ పోరాటం అయింది. 

నిజాం చివరి రోజుల్లో  తీసు కున్న ఈ నిర్ణయం 400 ఏళ్ల అద్భుత పరిపాలనకు మాయని మచ్చను తీసుకొచ్చింది. ‘రాజ్యాంగమెంత మంచిదైనా పాలకులు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా పాలకులు మంచివారైతే మంచిదిగా మారు తుంది’ అని రాజ్యాంగ  రచనా సంఘ అధ్యక్షుడు డా‘‘ అంబేడ్కర్‌ చేసిన హెచ్చరిక ఎప్పటికీ పాలకులను అప్రమత్తులను చేస్తూనే ఉంది. ఆ అప్రమత్తత నుంచి పుట్టిన ఆలోచనే కేసీఆర్‌ తీసుకున్న  కఠిన నిర్ణయం. నేడు ప్రశాంత హైదరాబాద్‌ మహానగరంగా మరోసారి నిలబడింది. వారం రోజులుగా నగరంలో జరుగుతున్న సంఘటనల పట్ల కేసీఆర్‌ నిర్ణయాన్ని సకల మతాలు, సబ్బండ జాతులు స్వాగతిస్తున్నాయి.

వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు


మొబైల్‌ : 94403 80141

మరిన్ని వార్తలు