కరోనాతో కలిసి బతకాల్సిందే!

16 May, 2020 03:52 IST|Sakshi

అక్షర తూణీరం

ఈ మాట చాలా ముందస్తుగా అన్నందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మీద నిప్పులు చెరిగారు. పారాసిటమాల్, బ్లీచింగ్‌ పౌడర్‌ అన్నారని కరోనా తీవ్రత గురించి ఆయనకేం తెలియదని.. మాట లొచ్చి మైకు దొరికిన టీడీపీ నాయ కులంతా దుయ్యబట్టారు. పది, పదిహేను రోజుల వ్యవధిలో కింది నుంచి పైదాకా ఇదే మాటకి వచ్చి స్థిరపడ్డారు. ముందన్నవాడు దోషి. తర్వాతి వారంతా దిశానిర్దేశకులు.

మన భారతదేశంలో ముందుగా కరోనా వైరస్‌ బారిన పరోక్షంగా పడి, బతికి బట్టకట్టినవారు పాండవులు. వారు ద్వాపర యుగంలో పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని ఏడాది అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఇది చాలా ప్రమాద కరం. చాలా భయంకరం! తేడా వస్తే మళ్లీ పన్నెండేళ్లు అర ణ్యవాసం... ఇక ఇంతే సంగతులు. అందుకని పాండవులు, ద్రౌపది చాలా విపత్తు మధ్యన ఏడాది గడిపారు. దుర్యో ధనాదులు ఎలాగైనా వీరి జాడ తెలుసుకోవాలని గూఢచా రులను పెంచారు.

పాండవులు కీచకుడితో, బకాసురుడితో దెబ్బలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనమంతా జాగరూక తతో ఉంటే కరోనా ఏమీ చెయ్యదని అంటున్నారు. ఈలోగా నడుస్తున్న ప్రభుత్వంమీద ఏదో ఒక రాయి విస రడం అపోజిషన్‌కి ఉత్సాహం. వారు నిత్యం వార్తల్లో ఉండకపోతే మరుగున పడిపోతామని భయం. అంతేగానీ ఇలాంటి సంకట స్థితిలో మన విమర్శలని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే ఆలోచనే ఉండదు. కరోనాతో కలిసి జీవించటమంటే, చిన్న చిన్న ఉపకారాలు అవసరంలో ఉన్నవారికి చేస్తే చాలు. అదే పదివేలు. పాకిస్తాన్‌ యుద్ధ సమయంలో నాటి మన ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి– దేశం కోసం ప్రతి ఒక్కరూ ఒక్క చపాతీ తగ్గించుకుని త్యాగం చెయ్యండని అభ్యర్థించారు.

దేశం బాగా స్పందిం చింది. ఇప్పుడు కూడా అన్నానికి అలమటిస్తున్న వారెం దరో ఉన్నారు. ఒక్క పిడికెడు మెతుకులు అన్నార్తులకు తీసిపెట్టండి. పుణ్యం పురుషార్థం. పంచగలిగిన వారు పదంటే పది పాల ప్యాకెట్లు పంచండి. ఇప్పుడు అందరం మంచి ఆహారం తీసుకోవలసిన సమయం. పోనీ రెండు గుడ్లు, ఏదైనా ఒక పండు. వీటికి ఏమాత్రం శ్రమ పడన క్కర్లేదు. జేబులో చెయ్యిపెట్టి కొంటే చాలు. మీరు కాకుంటే బోలెడు స్వచ్ఛంద సంస్థలు సేవ చేస్తున్నాయ్‌. వారికి వ్వండి. మహా ప్రసాదంగా పంచిపెడతారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌ అన్నాడు మహాకవి గురజాడ.

ఇంకా జరుగుబాటు, ఆర్థిక స్తోమత ఉన్న పింఛన్‌దార్లు తమ పెన్షన్‌ని పూర్తిగా లేదా పాక్షికంగా త్యాగం చెయ్యొచ్చు. సర్వీస్‌కంటే అధికంగా పెన్షన్‌ స్వీక రిస్తున్నవారు చాలామంది ఉంటారు. అది వారి హక్కే కావ చ్చుగానీ ఈ విపత్కర పరిస్థితిలో ప్రపంచాగ్నికొక సమిధని ఆహుతి ఇవ్వచ్చు. ఈ తరుణంలో వాకిట్లోకి వచ్చే కూరల బండ్ల దగ్గర, పండ్ల దగ్గర గీచిగీచి బేరాలు చెయ్యకుండా కొనండి. చాలు, వారిలో అత్మస్థైర్యం పెరుగుతుంది.

అందులో కొంతభాగం పండించే రైతుకి కూడా చేరుతుంది. అనుభవజ్ఞులు సూచించిన జాగ్రత్తల్ని పాటించండి. వ్యక్తి గత పరిశుభ్రత ముఖ్యం. ఎవర్నీ రాసుకు, పూసుకు తిరగ వద్దు. ఎక్కడైనా ఏ రేషన్‌ షాపుదగ్గరైనా, ఏ బ్యాంక్‌ వద్ద యినా రద్దీ చెయ్యద్దు. అందరికీ ఇస్తారు. ఇవ్వాళ కాకుంటే రేపు. బ్యాంకులో మీ ఖాతాలో జమ అయ్యాక ఆ డబ్బు ఇక మీదే. ఒక్కరోజు కొందరు సంయమనం పాటిస్తే చాలు. దొరికినంతలో మంచి ఆహారం తీసుకోండి. ఖరీదైనవి చాలా గొప్పవని భావించవద్దు.

ఆకుకూరలు చాలా మంచిది. దేశవాళీ పళ్లు బలవర్ధకమైనవి. స్తోమతగల ప్రతివారూ తమచుట్టూ ఉండే నాలుగైదు కుటుంబాల యోగక్షేమాల్ని, ఆకలినీ పట్టించుకుంటే చాలు. ఈ తరు ణంలో దీనికి మించిన దేశభక్తి దేవుడి భక్తి వేరే లేదు. అపోజిషన్‌ వాళ్లం కాబట్టి, విధిగా రాళ్లు వెయ్యాలనే సంక ల్పంతో ఉండవద్దు. మంచి సూచనలివ్వండి. గత్తరలో ఉన్న ఈ ప్రజని మరింత గత్తర పెట్టకండి.

మా ఊళ్లో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. సహృద యుడు, సంస్కారి. వందల ఎకరాల భూమి ఉండేది. పొలం పనులు వస్తే అట్టే ఊడ్పులు, కలుపులు, కోతలు వగైరాలకు ఊరు కూలినాలి జనమంతా వెళ్లేవారు. ఆయ నకో లెక్క ఉండేది. ఆడపిల్ల పైట వేసుకుంటే, మగ పిల్లాడు పంచెకట్టుకుంటే అందరితో సమంగా కూలి ముట్టజెప్పే వారు. అందుకని అయిదారేళ్ల ఆడపిల్లలకి గౌను మీద పైట, నిక్కర్‌మీద పంచె బిగించి చేలో దిగేవారు. ఈ మోసం అందరికీ తెలుసు. ఒకసారి ఆ భూస్వామితో అంటే– ‘పర్వాలేదులే, అయినా అంతా వాళ్ల కష్టం నించి వచ్చిం దేగా. నామీద ఇష్టంతో, దయతో వచ్చి చాకిరీ చేస్తున్నారు. ఇంతకంటే మనం చేసి చచ్చే పుణ్యకార్యాలేముంటాయ్‌’ అన్నాడు. అదీ మన భారతీయత. అదీ మన సంప్ర దాయం. గుర్తు చేసుకుని కరోనాతో కలిసి జీవిద్దాం. శుభమస్తు!
వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

మరిన్ని వార్తలు