భయానకం కాదు, మనోహరం

15 Mar, 2020 00:50 IST|Sakshi

జనతంత్రం

కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుని గుండెలు చీల్చిన భీముడు వేడి నెత్తురును దోసిట పట్టి ద్రౌపది కురులకు అలంకరించి ముడివేసిన దృశ్యం భయానకంగానే కనిపిం చవచ్చు. కానీ, అదే దుశ్శాసనుడు అంతఃపురంలో వున్న ద్రౌపదిని జుట్టు పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ నిండు రాజసభలోనికి లాక్కొని వచ్చి వలువలూడ్చిన వీడి యోను కూడా ప్లే చేస్తే పై దృశ్యం మనోహరంగానే కని పిస్తుంది. 

భీమసేనుడి గదాఘాతాలతో తొడలు విరుగుతున్న  ప్పుడు దుర్యోధనుడు చేసిన ఆర్తనాదం కర్ణకఠోరంగానే వినబడి ఉండవచ్చు. కానీ, తన స్వార్థం కోసం మారణ హోమానికి కారకుడైన ఒక అసూయాపరుడు చేసిన హాహాకారమని తెలిసినప్పుడు ఆ శబ్దం శ్రవణానందమే అవుతుంది. సత్యం సాపేక్షమయినప్పుడు సంఘటన వృత్తాంతం పూర్తిగా తెలిస్తేనే నిజం నిగ్గు తేలుతుంది.

మాచర్లకు వెళ్తున్న తెలుగుదేశం నాయకుల కారును ఒక వ్యక్తి కర్రతో పొడుస్తున్న సీన్‌ టీవీలో పదేపదే కని పించి కలవరాన్ని కలిగించింది. కానీ టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఒక కారు విసురుగా, దురుసుగా, ఓవర్‌స్పీడ్‌తో వెళుతూ ఒక దివ్యాంగ బాలుడ్ని ఢీకొట్టి ఆగకుండా నిర్దయగా వెళ్లిపోతున్నదని తెలిసినప్పుడు, కారు నడిపిన మనుషులను వదిలేసి కేవలం అద్దాలనే పగులగొడుతు న్నాడేమిటని సదరు వ్యక్తిపై కించిత్‌ ఆగ్రహం కూడా కలిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టోలో సింహభాగాన్ని ఇప్పటికే అమలు చేసిన కారణంగా పాలక పార్టీ దూకుడుగా ఉన్నది. ప్రతి పక్షానికి బెంగగా ఉన్నది. ఇక్కడ ప్రతిపక్షం అంటే చంద్ర బాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్లస్‌ ఎల్లో మీడియాగా అపఖ్యాతి పొందిన రెండు మూడు ప్రధాన పత్రికలు, అరడజన్‌ న్యూస్‌ చానళ్లు, నాలుగు డజన్ల ఔట్‌సోర్సింగ్‌ వెబ్‌ ఎడిషన్లు, నెలజీతంపై పనిచేస్తున్న రెండువేల మందితో కూడిన సోషల్‌ మీడియా ఆర్మీ. ఇంతమాత్రమే కాదు. 

వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో, రాజ్యాంగ వ్యవస్థల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన స్లీపర్‌సెల్సూ, అజ్ఞాతవాసంలో పాండవులు విరా టరాజు కొలువులో దాక్కున్నట్టుగా, బీజేపీ పంచన దాచి పెట్టిన ‘దేశం’ మిత్రపక్షం జనసేన పార్టీ వగైరాలంతా ప్రస్తుతం ప్రతిపక్షంగా లెక్క. చంద్రబాబు పల్లవి పాడ గానే ఈ ఊడలన్నీ కోరస్‌ అందుకుంటాయి. ప్రస్తుతం ఈ బృందం ఆలపిస్తున్న పాట సారాంశం... ‘‘నామినేషన్ల ఘట్టం భయానకంగా ముగిసింది. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నది. ప్రభుత్వ యంత్రాంగం పాలక పార్టీకి సహకరిస్తున్నది.’’

వాస్తవానికి మున్నెన్నడూ లేనంత ప్రశాంతంగా, ఎక్కడా హడావుడి లేకుండా ఈ ఎన్నికలు జరుగుతు న్నాయి. మామూలుగా ఎన్నికల సందర్భంగా జరిగే అల్లర్లు కూడా ఈసారి బాగా తగ్గి స్వల్పంగా చెదురు మదురు ఘటనలు మాత్రమే జరిగాయి. మద్యాన్ని, డబ్బును ఓట్ల కోసం ఎరవేయడంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఈ మార్పు సాధ్యమైంది. ఈ పరిణా మాన్ని ప్రతిపక్షం, మీడియా స్వాగతించి ఉండవలసింది. అలా చేసి వుంటే ప్రజాస్వామ్యం బలపడి ఉండేది. కానీ, అలా చేస్తే చంద్రబాబు పెంచి పోషించిన తరహా రాజ కీయం బలహీనపడుతుంది. ప్రలోభాలు, అవకాశవా దమే ఆయన తరహా రాజకీయం. అవే ఆయనను ఇంతటి వాడిని చేశాయి. రాజకీయాల్లో వాటికి తావులేకుండా చేస్తే ఇన్నాళ్ల చంద్రబాబు రాజకీయ జీవితం పునాదులే కుప్ప కూలుతాయి. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నింటిపై పేటెంట్‌ హక్కు ఆయనదే. ఎన్నికల వ్యవస్థలో ఓట్ల కొనుగోలును ఆయనే కళాత్మక విద్యగా మార్చారు. 

చివరకు ప్రభుత్వ ఖజానాతోనే ఓట్లను కొను గోలు చేసే సృజనాత్మకశైలిని కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. అధికార దుర్వినియోగంలో కొత్త శిఖరా లను అధిరోహించడం పాతికేళ్ల కిందటనే ఆయన ప్రారం భించారు. యువతరానికి తెలియకపోవచ్చు కానీ, పాత తరం వాళ్లకు బాగా గుర్తు. 1996 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కడప నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఓడించడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగాన్ని చూసి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నివ్వెరపోయింది. నియంతల రాజ్యంలో మొక్కుబడి ఎన్నికలు జరిపే తంతులో జరి గింది నాటి కడప ఎన్నిక. అప్పుడు జిల్లా ఎస్‌పీగా ఉన్న ఉమేశ్‌చంద్ర తానే వైఎస్సార్‌కు రాజకీయ ప్రత్యర్థిని అన్న ట్టుగా చెలరేగిపోయారు. వైఎస్‌ ముఖ్య అనుచరులంద రినీ బైండోవర్‌ కేసుల్లో ఇరికించి పూర్తిగా కట్టడి చేశారు. 

పోలీసులు జిల్లాల్లో టెర్రర్‌ వాతావరణాన్ని క్రియేట్‌ చేశారు. రిగ్గింగ్‌ చేస్తారనే ఆరోపణలు మోపి పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందుగానే కాంగ్రెస్‌ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలను, నాయకులను అరెస్ట్‌ చేశారు. తెలు గుదేశం పార్టీ వాళ్లను కొంతమందిని వ్యూహాత్మకంగా అజ్ఞాతంలోకి పంపి వైఎస్‌ అనుచరులే వారిని నిర్భం ధించారని హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ కేసులు వేయిం చారు. ఫలితంగా కీలకమైన ప్రచార ఘట్టంలో పాల్గొన కుండా వైఎస్‌ పలుమార్లు హైదరాబాద్‌కు కేసుల నిమిత్తం వెళ్లవలసి వచ్చింది. ధనప్రవాహం, ప్రలోభాల పర్వం ఆనాటికి కనీవినీ ఎరుగని స్థాయిలో నడిచాయి. 

అనేక గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఏజెంట్లు కూడా కూర్చోలేని స్థాయిలో స్వయంగా పోలీసులే భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వైఎస్‌ గెలుపును అడ్డుకోలేక పోయారు కానీ, ఆయన రాజకీయ జీవితంలో అతి స్వల్ప మెజారిటీ వచ్చేలా చేయడంలో మాత్రం విజయం సాధిం చారు. అటువంటి అనుభవం ఉన్న చంద్రబాబు మొన్న డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించడాన్ని చూస్తుంటే వింతగా అనిపించింది. ఎంత వింతగా అని పించినా సరే ఆయన తన వ్యూహం ప్రకారంగానే ముందుకు వెళతారు. 

‘నవ్విపోదురుగాక నాకేటి వెరపు’ అనేది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పటికిప్పుడు ఒక రాద్ధాంతాన్ని సృష్టించాలి. ఎందు కంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల విజ యంకంటే స్థానిక ఎన్నికల్లో మరింత పెద్ద విజయం సిద్ధించబోతున్నదని తన నలభయ్యేళ్ల అనుభవం చెవిలో చెబుతూనే ఉంది. తనకే కాదు తన అనుచరుల్లో చాలా మందికి వారి వారి అనుభవాలు అంతరాత్మలతో సంభా షిస్తూనే వున్నాయి. వారిలో కొందరు అంతరాత్మ ప్రబో ధాన్ని అనుసరిస్తున్నారు. ఈ స్థితిలో మరో దారుణ పరాజయాన్ని మౌనంగా ఆహ్వానించడం కంటే ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందన్న సాకుతో రాద్ధాం తాన్ని సృష్టించి పరువు దుక్కించుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ తక్షణ కర్తవ్యంగా మారింది. పీత కష్టాలు పీతవి అన్నట్టు కొన్ని ఇతర పార్టీలకు కూడా వాటి కష్టాలు వాటివి. అందువల్ల ముఖ్య ప్రతిపక్షంతో శ్రుతికలపడానికి అవి సిద్ధపడ్డాయి.

వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నది. అంతకు ముందు ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమం త్రిగా పద్నాలుగేళ్ల అనుభవం ఆయనకు వున్నది. ఇద్దరి దృక్పథాల్లో హస్తిమశకాంతరాన్ని జనం గుర్తిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పరిపాలన జనకేంద్రకంగా సాగుతుంటే, చంద్రబాబు పరిపాలన ధన కేంద్రకంగా నడిచింది. గ్రామస్థాయి జన్మభూమి కమిటీ సభ్యుని దగ్గర నుంచి అత్యున్నతస్థాయి వరకూ ధనార్జన మీదనే దృష్టి సారించి జనంలో భ్రష్టు పట్టిన అనుభవం గత ప్రభుత్వానిది. అవినీతి మీద ఉక్కుపాదం మోపిన ఆచరణ ప్రస్తుత ప్రభుత్వానిది. పోలవరం ప్రాజెక్టును బాబు ప్రభుత్వం ఏటీఎమ్‌గా మార్చుకున్నదని స్వయంగా ప్రధానమంత్రే ‘విమర్శించారు’. 

రీటెండరింగ్‌తో కమీషన్‌లకు కళ్లెం వేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విష యంలో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నదని మెచ్చి పెరిగిన ప్రాజెక్టు వ్యయభారాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. కొత్త రాజధానిని ప్రపంచం లోనే అతి పెద్ద స్కామ్‌గా బాబు ప్రభుత్వం మారిస్తే, రాజధా నిని ప్రజలకు చేరువ చేస్తామన్న కమిట్‌మెంట్‌ను జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు... దళితులు శుభ్రంగా ఉండరు... మాది గైతే చదువేం వస్తుంది’ అనే ఆలోచనా ధోరణి గత ప్రభు త్వానిదైతే, దళితుణ్ని ఉపముఖ్యమంత్రిగా, దళిత మహి ళను హోం మంత్రిగా నియమించి దళిత జాతికి ఆత్మ గౌరవ కిరీటాన్ని తొడిగిన అంబేడ్కర్‌ భావజాలం ప్రస్తుత ప్రభుత్వానిది. బీసీలు జడ్జీలుగా పనికిరారంటూ కేంద్రా నికి లేఖ రాసిన చరిత్ర బాబుదైతే, బీసీలకు చట్ట సభల్లో సైతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ పార్లమెంట్‌లో బిల్లును పెట్టించి ఫూలేకు నివాళులర్పించిన ఏకైక జాతీయ నాయకుడన్న ఘనత జగన్‌ది. 

ఐదేళ్ల పదవీ కాలంలో నాలుగున్నరేళ్ల పాటు గిరిజనుడికి మంత్రి పదవి కూడా నిరాకరించి, రాజ్యాంగబద్ధమైన గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయని అలక్ష్యం నాటి ముఖ్య మంత్రిదైతే, గిరిజన మహిళను ఉపముఖ్యమంత్రిని చేసి గౌరవించడమే గాక, గిరిజనాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టిన ఆపేక్ష నేటి ముఖ్యమంత్రిది. పేదింటి బిడ్డల చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేసి సర్కారు బడులు శిథి లమవుతున్నా జాలి చూపని నాయకుడు బాబు. సర్కారు బళ్లను తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టి, ఇంగ్లీషు మీడి యాన్ని కూడా ప్రవేశపెడుతూ ‘పేద బిడ్డ పెద్ద చదువులు  అందుకు నేనున్నాన’ంటూ ఢంకా భజాయించిన నాయ కుడు జగన్‌. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్ని విష యాల్లోనూ ప్రభుత్వ పరిపాలనపై ఇరువురి దృక్పథాల్లో మౌలికమైన తేడాలున్నాయి. 

అసలు ప్రభుత్వమంటే ఏమిటి? అది ఎలా కనిపి స్తుంది? ఎలా వినిపిస్తుంది అనే తాత్వికాంశంపై ప్లేటో, అరిస్టాటిల్, థామస్‌ హాబ్స్, జెర్మీ బెంథామ్, రూసో, మాకియవెలీ వగైరా రాజనీతి సిద్ధాంతవేత్తలు రకరకాల నిర్వచనాలు చెప్పారు. వాళ్లకంటే గొప్పగా ఇప్పుడు సామాన్య జనం ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు. తమ జీవనగమనంలో వెంటనడిచే మిత్రునిగా వారు ప్రభుత్వాన్ని చూస్తున్నారు. తమ పురోభివృద్ధికి బాటలు పరిచే గురువుగా భావిస్తున్నారు. ఒక తండ్రిగా, తల్లిగా, అన్నగా అండగా నిలవాలని ఆశిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 250 రోజులు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఒక సంస్థ ప్రజాభిప్రాయాన్ని సర్వే చేయడానికి జిల్లాలకు ప్రతినిధులను పంపించింది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆటోడ్రైవర్‌ ఈ సంస్థ ప్రతినిధికి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా వుందట. పాత ప్రభుత్వం కంటే కొత్త ప్రభుత్వం ఎక్కువ అందు బాటులో ఉందని భావిస్తున్నారా? అని ఆ ప్రతినిధి అడి గారట. దానికి ఆటోడ్రైవర్‌ ఇచ్చిన సమాధానం... ‘అందు బాటులో ఉండడమేమిటి? మా ఇంటికే ప్రభుత్వం వచ్చి పోతున్నది. జగనన్నతో మేము రోజూ మాట్లాడుతూనే ఉన్నామన్నా’డట. ఎలా అంటే... ‘ఆటో డ్రైవర్‌గా  పది వేల రూపాయల వాహనమిత్ర పథకం వర్తించింది. నా పిల్లలు బడికి బయల్దేరుతుంటే జగనన్న టాటా చెబు తున్నట్లే అనిపిస్తున్నది. 

ఎందుకంటే అమ్మ ఒడి పేరుతో ఏడాది ముందే వాళ్ల చదువు ఖర్చులను ప్రభుత్వం మాకు జమచేసింది. ఇళ్ల పట్టాలకు నా భార్య పేరు ఎంపికైంది. తొందర్లో పట్టా చేతికొస్తుంది. మా నాన్నకు వచ్చే పెన్షన్‌ వలంటీర్లు ఇంటికి వచ్చి ఒకటో తారీకునాడు ఆదివార మైనా సరే ఇచ్చి వెళ్లారు. రేషన్‌ ఇంటికొస్తున్నది. ఇంటి దగ్గర్నుంచి వందడుగులు వేస్తే సచివాలయం. ప్రభుత్వం అందుబాటులో కాదు, మా ఇంట్లోనే ఉంది’ అని ముగిం చాడట సదరు ఆటోడ్రైవర్‌. రాష్ట్రంలో ప్రజలందరి అభి ప్రాయం దాదాపు ఇదే. అందుకే చంద్రబాబులో కల వరం. తాను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వ్యవస్థ పతనమవుతున్నది. 

వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన ఒక కొత్త రాజకీయ వ్యవస్థ చిగురు తొడగడం ప్రారంభ మైంది. ఈ పరిణామం కారణంగా నష్టపోయే శక్తులు ఖాళీగా కూర్చోవు. మార్పుకు వ్యతి రేకంగా బలంగా గొంతు విప్పుతాయి. వ్యవస్థల మీద ఉన్న పట్టు కార ణంగా ఆ గొంతు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో వినిపిస్తుంది. నిరసన శబ్దాలు బిగ్గరగా వినిపిస్తాయి. మరక మంచిదే అన్నట్టు ఆ శబ్దం కూడా మంచిదే. మహా విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) ఫలితంగానే కదా విశ్వం ఆవిర్భ వించింది. అణువును పగలగొడితేనే కదా పరమాణువు శక్తి సాక్షాత్కరించేది. శబ్దం మంచిదే. ఇక మార్పు తప్పదు.

వ్యాసకర్త: వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

మరిన్ని వార్తలు