చేతిరాతతో అధిక మార్కులు సొంతం
స్పష్టమైన సమాధానాలకు ప్రాధాన్యం
పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరం
సాక్షి, అచ్చంపేట/పిడుగురాళ్లటౌన్: ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ప్రతిది కీబోర్డుల పైనే ఆధారపడుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒకప్పుడు టెస్ట్బుక్ మొత్తం తిరగేసి ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని తరచూ వాటిని మననం చేసుకునేవారు. దానివల్ల చేతి రాత పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. కాని ఇప్పుడు కావలసిన ప్రశ్నను సూటికా గుగుల్ సర్చ్ చేసి, ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం తెలుసుకోవడం, దానిని సేవ్ చేసుకుని అవసరమైనపుడు ఉనియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల చేతికి పని తగ్గిపోతుంది. స్పష్టం రాయగలిగేవారు కూడా అప్పుడప్పుడు మాత్రమే రాయడం వల్ల స్పష్టతను కోల్పోతున్నారు.
ఈ ప్రభావం పబ్లిక్ పరీక్షలో విద్యార్థులపై పడి బాగా చదివినా ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. బాగా చదివాం, చదివిన ప్రశ్నలే వచ్చాయి, బాగానే రాశాం, కాని మార్కులు రాలేదని తెగ బాధపడిపోతారు. కారణం తెలుసుకునేందుకు రీవాల్యూషన్ పెట్టుకుని, చేతి రాత సక్రమంగా లేకపోవడం, మనం రాసినవి మనకే అర్థంకాకపోవడం వల్లనేనని అప్పుడు తెలుసుకుంటాం. మార్కులు ఎందకు తక్కువ వచ్చాయో.. అప్పుడు చింతించిన ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ముందుగా కష్టపడి చదవడం ఎంతముఖ్యమో.. చదివిన విషయాన్ని స్పష్టంగా రాయడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
‘పది’లో పట్టుకు ప్రణాళిక అవసరం
గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే చాలామంది పిల్లల్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే ముందు నుంచే ప్రణాళిక అవసరం. అలా చేస్తే అమ్మో పాసవుతామో లేదో అన్న భయం వారిలో పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ పిల్లలకు డీ–గ్రేడ్ వచ్చిందంటే వారిని తామున్నామంటూ ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అలా చాలా పాఠశాలల్లో పిల్లల్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నారు. ఆ వివరాలను గుడివాడ డీవైఈవో ఎం.కమలకుమారి వెల్లడించారు.
టెన్త్లో ఉత్తీర్ణతకు నియమాలిలా..
- డీవైఈవో కమలకుమారి
అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి
కొంత మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కాకుండా అలానే ఉండే మరో ప్రశ్నకు సమాధానాలు రాస్తూ ఉంటారు. అదే ప్రశ్న రాస్తున్నామా లేదా అనే ఆందోళనతో రాస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అక్షరాలు సక్రమంగా రాయలేరు. రాసిన సమాధానంలో స్పష్టత ఉండదు. అక్షర దోషాలు కూడా ఎక్కువగా దొర్లుతాయి. ఫలితంగా ఆశించిన మార్కులను కోల్పోవలసి వస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ముందునుంచే చేతి రాతపై దృష్టిపెట్టాలి.
– టి.బాలశౌర్రెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లచెరువు
చేతి రాత కీలకం
విద్యార్థులు చదవడంతో పాటు బాగా రాయడం కూడా ముందునుంచే సాధన చేయాలి.మనం రాసే అక్షరాలు స్పష్టంగా, గుడ్రంగా అందంగా ఉంటే మన సమాధానం పత్రం దిద్దే ఉపాధ్యాయుడు మరికొన్ని మార్కులను అదనంగా రాసే అవకాశంం ఉంటుంది. పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలంటే చేతి రాత కీలకం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
– వి.రాజశేఖర్, ఎంఈవో, అచ్చంపేట మండలం
నిబంధనలు పాటిస్తే మేలు
జవాబులు రాసే విధానంలో దిద్దుబాట్లు లేకుండా జాగ్రత్తపడాలి. వ్యాసరూప ప్రశ్నలకు పాయింట్లవారిగా సమాధానాలు రాస్తూ మధ్యలో ఉపశీర్షికలు ఇవ్వాలి. పదాల మధ్య స్పేస్, కామా, పుల్స్టాప్ ఇవ్వటం మూలంగా వాక్యాలు అందంగా కనిపిస్తాయి. బిగ్ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు కొట్టి వేతలు ఉండకూడదు. ప్రశ్నలపై సందేహాలుంటే ఇన్విజిలేటర్ను అడిగి నివృత్తి చేసుకోవాలి.
–బి.మల్లికార్జునశర్మ, ఎంఈవో, పిడుగురాళ్ల