యువత చెంతకే డ్రైవింగ్‌ లైసెన్సులు

2 Jan, 2018 10:46 IST|Sakshi

రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలు

ప్రతి వారం ఒక కళాశాలలో నిర్వహణ

నగరంపాలెం(గుంటూరు): యువతకు సులభ పద్ధతిలోనే డ్రైవింగ్‌ లెసెన్సుల జారీ చేసే పరీక్షలను నిర్వహించనున్నారు.  ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్‌ లైసెన్సుల రిజిస్ట్రేషన్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానం అమలు కావటంతో కార్యాలయాలకు, మీ సేవలకు రాకుండానే వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ అర్హత గల విద్యార్థులకు కంప్యూటర్‌ ద్వారా నిర్వహించే లెర్నింగ్‌ లైసెన్సు టెస్టులు కళాశాలలోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలి దశలో ప్రతి జిల్లాలో ఇంజినీరింగ్‌  కళాశాలలో విద్యార్థులకు ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్టులు నిర్వహించి అర్హులందరికీ డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారులను గత రెండు నెలలు క్రితం ఆదేశించారు.

అక్కడికక్కడే ఎల్‌ఆర్‌ మంజూరు
ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌కి కేవలం విద్యార్థుల ఆధార్‌ నంబరు, బయెమెట్రిక్‌ డివైజ్‌పై ఫింగర్‌ ఉంచటం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రవాణాశాఖ అధికారులు ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌ నిర్వహించే రోజును వారం ముందే ఎంపిక చేసిన ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యానికి  అర్హులను పరీక్ష నిర్వహించే రోజు ఆధార్‌ కార్డులతో హాజరు కావల్సిందిగా సమాచారం అందిస్తారు. ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌కి సంబంధించి రోడ్‌ సిగ్నల్స్, రూల్స్‌ ఆఫ్‌ రోడ్‌ రెగ్యూలైజేషన్, జనరల్‌ డ్రైవింగ్‌ ప్రిన్సిపల్స్‌ యూజర్‌ గైడ్‌ అందిస్తారు. జిల్లాలోని ప్రతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్ట్‌లను ప్రతి ఒక వారం ఒక చోట నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్‌ జీసీ రాజరత్నం తెలిపారు.

మరిన్ని వార్తలు