కేన్సర్‌నే కిల్ చేద్దాం!

12 Apr, 2016 03:03 IST|Sakshi
కేన్సర్‌నే కిల్ చేద్దాం!

ప్రాణాంతక వ్యాధి చికిత్సకు కొత్త ఆయుధాలు
తెరపైకి కొత్త కొత్త పద్ధతులు.. బ్యాక్టీరియాలు,
వైరస్‌లతో కణితులను తగ్గించొచ్చు..
కణితుల జన్యు క్రమం
తెలుసుకోవడం ద్వారా చికిత్సలు
అనేక దేశాల్లో విజయవంతం..

సాక్షి, హైదరాబాద్
: కేన్సర్... ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తున్న మహమ్మారి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాణాంతక వ్యాధిని నయం చేసేందుకు శస్త్రచికిత్స.. కీమోథెరపీ.. రేడియో థెరపీ వంటి మూడే చికిత్స మార్గాలుండేవి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి సరికొత్త చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని ఇప్పటికే రుజువు చేశారు. దీంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను కూడా తెరపైకి తీసుకొచ్చారు. తాజా పరిశోధనల తీరుతెన్నులపై ఓ లుక్కేద్దాం.
 
బ్యాక్టీరియాతో కేన్సర్ కణాలకు చెక్..
బ్యాక్టీరియా అనగానే రోగ కారకం అని అందరూ భావిస్తారు. అయితే అన్నీ మానవునికి చెడు చేసేవే కావు.. కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాలు ఉంటాయనే విషయం కూడా చాలా మందికి తెలుసు. కొన్ని రకాల బ్యాక్టీరియాలను కేన్సర్‌పై యుద్ధం చేసేందుకు శాస్త్రవేత్తలు ఆయుధంగా మలుచుకున్నారు. అమెరికాలోని బయోమెడ్ వ్యాలీ డిస్కవరీస్‌కు చెందిన డాక్టర్ సౌరభ్‌సాహా ఇలాంటి పరిశోధనే చేశారు. కొన్ని రకాల బ్యాక్టీరియాలు కేన్సర్ కణితుల పరిమాణం తగ్గేలా చేస్తాయని కొన్ని కుక్కలు, ఓ మనిషి కేన్సర్ కణితులపై ఆయన చేసిన అధ్యయనంలో తేలింది. కేన్సర్ కణాలున్న చోట ఆక్సిజన్ తక్కువగా, ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన వాతావరణం కొన్ని రకాల బ్యాక్టీరియాలు పెరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. క్లాస్ట్రీడియం నోవీ అనే బ్యాక్టీరియాను ఆయన కేన్సర్ కణాల్లో పెరిగేలా చేశారు. ఈ బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందే క్రమంలో విడుదలైన ఎంజైములు కేన్సర్ కణితుల పరిమాణం తగ్గించాయని పేర్నొంటున్నారు. 16 కుక్కలపై జరిపిన పరిశోధనల్లో 6 కుక్కలు ఈ చికిత్సకు స్పందించగా, మూడింటిలో కణితి పూర్తిగా మాయమైంది. మిగిలిన వాటిలో 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఊపిరితిత్తులు, లివర్, ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న 53 ఏళ్ల ఓ మహిళలోనూ నెల రోజుల్లోనే కణితి పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ రకం చికిత్సలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం గమనార్హం. అయితే వందేళ్ల కిందే విలియం కోలీ అనే శాస్త్రవేత్త ఇలాంటి ప్రయోగాలు చేశారు.
 
రోగ నిరోధక వ్యవస్థకు తర్ఫీదు...
కేన్సర్ సోకినప్పుడు శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దీంతో కేన్సర్ శరీరం మొత్తం విస్తరిస్తుంది. ఇలా జరగకుండా ఈ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యం చేసి కేన్సర్ కణాలపై నేరుగా యుద్ధం చేసేలా పరిశోధకులు ఇమ్యునోథెరపీ అనే కొత్త ఆవిష్కరణ చేశారు. ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్‌హిబిటర్స్ అనే ప్రత్యేకమైన మందుల ద్వారా రోగ నిరోధక వ్యవస్థలోని టీ కణాలు ఉత్తేజితమై నేరుగా కేన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ఈ విధానంతో పాటు కీమో, రేడియేషన్‌థెరపీలను కలిపి ఉపయోగించడం ద్వారా తక్కువ దుష్ఫలితాలతో మెరుగైన చికిత్స సాధ్యమవుతుందా అన్న అంశంపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొత్తగా సోకిన 25 శాతం మంది కేన్సర్ రోగులకు ఇమ్యునోథెరపీ ద్వార చికిత్స అందిస్తున్నారు. ఇది త్వరలోనే 50 శాతానికి పెరగొచ్చని అంచనా.
 
వ్యక్తిగత వైద్యంతోనూ చెక్..
వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) విషయంలో ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లే.. కేన్సర్ కణాలు కూడా జన్యుక్రమం ప్రకారం వేరువేరుగా ఉంటాయి. అయినా అందరికీ ఒకే రకమైన మందులు ఇస్తుంటారు. ఇవి కొందరిలో బాగా పనిచేస్తాయి.. మరికొందరిలో అసలు పనిచేయవు. అందుకే ముందుగా కేన్సర్ కణాల జన్యుక్రమాలను ముందుగా విశ్లేషించి, ఆయా జన్యుమార్పులకు సంబంధించి సమర్థమైన మందులను గుర్తించి రోగికి ఇస్తారు. ‘పర్సనలైజ్డ్ ఆంకోజెనోమిక్స్’ అని పిలుస్తున్న ఈ పద్ధతి ద్వారా మందుల దుష్ర్పభావాలను తగ్గించడమే కాకుండా మెరుగైన చికిత్స అందజేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 
శరీరంలోని కణాలు నిత్యం విభజన చెందుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే కొన్ని కణాల్లోని జన్యువులు పరివర్తనం చెందడం వల్ల అడ్డూ అదుపు లేకుండా విభజన చెందుతాయి. ఇవి కణితులుగా ఏర్పడతాయి. శరీరంలోని వేర్వేరు భాగాల్లో కణితులు ఏర్పడతాయి. కణితులు ఏర్పడే భాగాన్ని బట్టి దాదాపు వంద రకాలకు పైగా కేన్సర్లు ఉన్నట్లు అంచనా. అతిసాధారణంగా గుర్తించే కేన్సర్‌గా ప్రొస్టేట్ కేన్సర్ తొలిస్థానంలో ఉంది. కోలోరెక్టల్, బోవెల్, బ్రెస్ట్ కేన్సర్‌లు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఊపిరితిత్తుల కేన్సర్ 5వ స్థానంలో ఉంది. అన్నిరకాల కేన్సర్లతో వీటి వాటా 60 శాతం.
ప్రతి లక్ష మందిలో 338 మంది కేన్సర్‌తో బాధపడుతున్నారు. కేన్సర్ బాధిత దేశాల్లో డెన్మార్క్ తొలిస్థానంలో ఉంది. అమెరికా 6వ స్థానం, భారత్ 128వ స్థానంలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ చికిత్సకు ఖర్చు చేస్తున్న మొత్తం ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైనే.
2010-14 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కనీసం కేన్సర్ చికిత్సకు 45 కొత్త మందులు మార్కెట్లోకి వచ్చాయి.
 
నానో టెక్నాలజీ సాయంతో...
కీమో, రేడియో థెరపీలో కేన్సర్ కణాలతో పాటు వాటి పక్కన ఉండే ఆరోగ్య కణాలు కూడా నాశనం అవుతాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కేవలం కేన్సర్ కణాలను టార్గెట్ చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. కీమో థెరపీ, రేడియో థెరపీల్లో వాడే మందులు నేరుగా కేన్సర్ కణాలనే నాశనం చేసేందుకు నానో టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. దీంతో ఈ మందుల ప్రభావం కేవలం కేన్సర్ కణాలపైనే ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని జరగదు. ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని నానో టెక్నాలజీ ఆధారిత మందులకు అనుమతులు కూడా ఇచ్చింది.

మరిన్ని వార్తలు