ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

2 Mar, 2016 09:34 IST|Sakshi
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వీణాపూర్ కళాశాలలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. అనంతపురం జిల్లా కురాకులపల్లి గ్రామానికి చెందిన మలపుల సుమలత(20) కళాశాల హాస్టల్‌లో ఉంటూ బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం హాస్టల్‌లో ఫోన్ వాడకం పై వార్డెన్‌కు విద్యార్థినికి మద్య వాగ్వాదం జరగింది. అప్పటి నుంచి అన్యమనస్కంగా ఉంటోంది.
 
మంగళవారం రాత్రి గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ సాయంతో తలుపును పగలగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె రూమ్ లో దొరికిన నోట్‌బుక్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాని నోట్ బుక్ లోని మొదటి పేజీని ఎవరో చించినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న వివరాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. 
 

 

>
మరిన్ని వార్తలు