బోనాలకు 10 కోట్లు

21 Jul, 2015 09:24 IST|Sakshi
సోమవారం బోనాలపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు.

* ప్రభుత్వం తరఫున వైభవంగా ఏర్పాట్లు  
హోంమంత్రి అధ్వర్యంలో మంత్రుల కమిటీ
* అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాన్ని జంటనగరాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవ ఏర్పాట్ల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరో రూ.5 కోట్లు వెచ్చించనుంది.

బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయ శాఖ ద్వారా రూ.5 కోట్లు, జీహెచ్‌ఎంసీ ద్వారా రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్రను ఆదేశించారు.

బోనాల ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావుతో మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మంత్రుల కమిటీ జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుని బోనాలు ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను సీఎం ఆదేశించారు.

బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులు శుభ్రంగా ఉండేలా చూడాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు నాయిని, తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
ప్రతి నియోజకవర్గానికి రూ.20 లక్షలు
బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పాతబస్తీలోని ఒక్కో ఆలయానికి రూ. 3 లక్షలు, పాతబస్తీ మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ నిధులను ఆయా నియోజకవర్గాల  శాసనసభ్యులు, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

హోంమంత్రి నాయిని అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, నగరానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ.. జంటనగరాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, దేవాలయ ప్రాంగణాల్లో భారీగా విద్యుత్ దీపాల అలకంరణ చేయనున్నట్లు తెలిపారు.

ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరం కలసి పనిచేయాలని నిర్ణయించామన్నారు.
 
జాతీయ స్థాయిలో బోనాలకు ప్రచారం కల్పిస్తాం
బోనాల విశిష్టత, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడమే ఉద్దేశంగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించనున్నట్టు లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళి (హైదరాబాద్) ఆలయ కమిటీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్, సలహా బోర్డు చైర్మన్ ముఖేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ వివరాలు వెల్లడించారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం సాయంత్రం మహాంకాళి విగ్రహ ప్రతిష్ట చేయనున్నామన్నారు. పోతురాజు, ఘటం, బంగారు, వెండి బోనాల కార్యక్రమం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో తానా మహాసభల్లో బోనాల పండుగ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 
నేడు బల్కంపేట ఎల్లమ్మ గుడికి సీఎం దంపతులు
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరుకానున్నారు. మంత్రి తలసాని అధ్వర్యంలో పలువురు వేద పండితులు, పురోహితులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి కల్యాణోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బాలకృష్ణశర్మ అధ్వర్యంలో ముఖ్యమంత్రికి ఆశీర్వాదం ఇచ్చారు.

మరిన్ని వార్తలు