గో మూత్రంతో తిరిగే గడియారం

12 Dec, 2015 11:51 IST|Sakshi

ఉంగుటూరు : గడియారం తిరగడానికి బ్యాటరీ అవసరం లేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని గోపాలకృష్ణ గోశాల నిర్వాహకులు. రెండు లీటర్ల గోమూత్రంతో గడియారం తిరిగేలా చేయవచ్చని నిరూపించారు. గోశాల వార్షికోత్సవం సందర్భంగా ఈ విధానాన్ని ప్రదర్శించారు. గడియారాన్ని పనిచేయించే విధానం ఇలా.. రెండు ప్లాస్టిక్ డబ్బాల్లో లీటరు చొప్పున గోమూత్రం నింపాలి. రెండు జింక్ ప్లేట్లు, రెండు కాపర్ ప్లేట్లను తీసుకోవాలి. రెండు జింక్ ప్లేట్లకు విద్యుత్ వైరు అమర్చి గో మూత్రం ఉన్న ఒక డబ్బాలో వేయాలి.
 
 ఇది మైనస్‌గా పనిచేస్తుంది. గో మూత్రం ఉన్న మరో డబ్బాలో వైరు అమర్చిన రెండు కాపర్ ప్లేట్లు ఉంచాలి. ఇది ప్లస్‌గా పనిచేస్తుంది. ఈ రెండు వైర్లను బ్యాటరీ పరిమాణంలో ఉండే పుల్లముక్కకు రెండు వైపులా అమర్చి, ఆ పుల్లముక్కను గడియారంలో ఉండే బ్యాటరీ స్థానంలో అమర్చితే గడియారం పనిచేస్తుంది. డబ్బాల్లో ఒకసారి పోసిన ఆవు మూత్రంతో గడియారం 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేస్తుంది. ఆ తరువాత ప్రతి 14 రోజులకు ఒకసారి డబ్బాల్లోని గో మూత్రం మారిస్తే సరిపోతుంది. వివరాలకు 99487 96638 నంబర్‌లో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు