రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి

26 Dec, 2015 19:10 IST|Sakshi

- తెలంగాణవ్యాప్తంగా గణనీయంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు
-రామగుండంలో 9, నిజామాబాద్‌లో 10 డిగ్రీల కనిష్టం నమోదు
- అన్ని జిల్లాల్లోనూ 2 నుంచి 6 డిగ్రీల మేరకు తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ : తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 6 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లోనైతే 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. మెదక్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది. అక్కడ సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా రికార్డు అయింది.

రామగుండంలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. అక్కడ కూడా సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. నిజామాబాద్‌లో 10 డి గ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రికార్డు అయింది. హైదరాబాద్‌లో 12.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సాధారణం కంటే 2.4 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఒక్క హన్మకొండలో మాత్రమే సాధారణం కంటే ఒక డిగ్రీ అదనంగా 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాంతాలవారీగా వాతావరణశాఖ చరిత్రలో రికార్డు స్థాయిలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు :
1) ఆదిలాబాద్-  జనవరి 26, 2006 : 5.2
2) భద్రాచలం- జనవరి 5, 1962 : 8.4
3) హన్మకొండ- డిసెంబర్ 29,1902 : 8.3
4) హైదరాబాద్- జనవరి 8,1946 : 6.1
5) ఖమ్మం- జనవరి 8,  1946 : 9.4
6) మహబూబ్‌నగర్-  జనవరి 16,2009 : 9.1
7) మెదక్- డిసెంబర్ 11, 1981 : 6.9
8) నల్లగొండ-  డిసెంబర్ 22, 2010 :10.6
9) నిజామాబాద్- డిసెంబర్ 17,1897 : 4.4
10) రామగుండం-  జనవరి 14,2012 : 6.8

మరిన్ని వార్తలు