ఎంబీబీఎస్ సీట్లపై జాతీయ విధానానికి వెళ్లం

10 Jul, 2015 04:17 IST|Sakshi

సాక్షితో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల విషయంలో నేషనల్‌పూల్(జాతీయ విధానం)లో చేరేది లేదని ఆంధ్రప్రదేశ్  స్పష్టం చేసింది. దీంతో ఏపీ పరిధిలోని మెడికల్ కాలేజీ సీట్ల కోసం ఆ ప్రాంత విద్యార్థుల మధ్యే పోటీ ఉంటుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లంకా వెంకట సుబ్రమణ్యం సాక్షితో ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. అటానమస్ సంస్థలైన శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్), పద్మావ తి మెడికల్ కళాశాలల్లో ఉన్న సీట్లకు కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తామన్నారు.  

వచ్చే ఏడాది నుంచి ప్రవాస భారతీయ కోటా (ఎన్‌ఆర్‌ఐ) సీట్ల భర్తీని కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఏపీలో నిర్వహిస్తామన్నారు.  15 శాతం నాన్‌లోకల్ కోటా కింద ఉస్మానియా, గాంధీ వంటి పేరున్న కళాశాలల్లో చేరేవారుంటారన్నారు. అలాంటి వాళ్లు తెలంగాణ కౌన్సెలింగ్‌తో చేరిపోతారనీ ,ఆ తర్వాత ఏపీలో సీట్ల భర్తీ జరిగితే బదిలీ సమస్య అనేది ఉండదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో యాజమాన్య కోట సీట్ల భర్తీ పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు