పార్లమెంట్‌లో కౌంటర్ చేయాలి

18 Jul, 2015 01:39 IST|Sakshi

‘ఓటుకు కోట్లు’పై ఎంపీలకు బాబు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారా న్ని లేవనెత్తే అవకాశాలున్నందున దానికి కౌంటర్‌గా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయాలను ప్రస్తావించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ, బీజేపీ ఎంపీలకు సూచించా రు. నేతల ఫోన్ల ట్యాపింగ్, సెక్షన్ 8 అమలు వంటి విషయాలను ప్రస్తావిస్తూ గొడవ చేయాలని చెప్పారు.

సమావేశంలో పాల్గొన్న ఎంపీలు అందించిన సమాచారం మేరకు... పార్లమెంట్‌లో మిత్రపక్ష బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విషయాలేవీ లేవనెత్తరాదని సూచించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన బీజేపీ, టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నడుచుకోవలసిన తీరుపై వివరించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా తాను చేసిన విదేశీ పర్యటనలు, రాష్ట్రాభివృద్ధికి తాను చేస్తున్న కృషిని చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు.

ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి ఏడాది గడిచినా కేంద్రం నుంచి అధికంగా నిధులు, పథకాలు సాధించలేకపోయామని ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత ఉందని చెప్పారు. అయినప్పటికీ కేంద్రంతో సంబంధాలు తెగిపోయేలా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించరాదని చెప్పారు.

ఏపీ పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే పలు అంశాలను అమలు చేస్తామని కేంద్రం ఈ సమావేశాల్లో హామీ ఇస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలతో పాటు ముస్లింల కు అందిస్తున్న తోఫాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా ఉపయోగించుకోవాల్సిందిగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

మరిన్ని వార్తలు