శ్రీవారి సేవకు రాష్ట్రపతి

25 Dec, 2015 03:36 IST|Sakshi
శ్రీవారి సేవకు రాష్ట్రపతి

తిరుమలలో టీటీడీ ఘనంగా ఏర్పాట్లు
 
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం తిరుమల రానున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన కోసం టీటీడీ ఘనంగా ఏర్పాట్లుచేసింది. ఇందులో భాగంగా ఆయన విడిది చేయనున్న పద్మావతి అతిథి గృహంలోని గదులను సరికొత్త హంగులతో తీర్చిదిద్దింది. ఈ ఏర్పాట్లను జేఈవో శ్రీనివాసరాజు స్వయంగా పరిశీలించారు. అన్నీ సవ్యం గా ఉన్నాయా? లేవా? గుర్తించి రిసెప్షన్ అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రపతితో పాటు వస్తున్న గవర్నర్ నరసింహన్ కోసం కేటాయించిన శ్రీకృష్ణ, సీఎం చంద్రబాబు కోసం కేటాయించిన లైలావతి అతిథి గృహాల్లో కూడా అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలకు బస, దర్శనం, అన్నప్రసాదాల విషయంలో ఎలాంటి లోటులేకుండా చూడాలని జేఈవో సంబంధిత అధికారులకు ఆదేశించారు. జేఈవో వెంట అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈ-2 రామచంద్రారెడ్డి, రిసెప్షన్ అధికారులు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఝాన్సీ, లక్ష్మీనారాయణయాదవ్, డెప్యూటీ ఈవో  సాగివేణుగోపాల్, శాస్త్రి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట పాల్గొన్నారు.
 
వరాహస్వామిని  దర్శించుకోనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అదే సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరాహస్వామి దర్శనానంతరం శ్రీవారిని దర్శించుకంటారు.

>
మరిన్ని వార్తలు