పింప్రీ: పుణే ఎరవాడ సెంట్రల్ జైలులో హత్య జరిగింది. ఓ ఖైదీ మరో ఖైదీ తలపై రాయితో మోది హత్య చేశాడు. ఈ సంఘటన పుణేతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేకెత్తించింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుఖదేవ్ మహాపూర్ (43) అనే వ్యక్తి అపహరణ నేరంపై శిక్ష అనుభవిస్తుండగా దినేష్ దబడే (35) అనే వ్యక్తి హత్యా నేరంపై జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య వంట గదిలో స్వల్ప విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపటికి వెనుక నుంచి వచ్చిన దబడే సుఖదేవ్ తలపై పెద్ద బండతో మోదాడు. దీంతో సుఖదేవ్ అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఒకే బారికేడ్లో ఉండేవారని తెలిసింది. ఈ విషయంపై జైలు యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.