ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురూ!

18 Jul, 2015 01:50 IST|Sakshi
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు షురూ!

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.tseamcet.nic.in ద్వారా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించిన మొదటి రెండు గంటల్లోనే 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాలేజీలు, బ్రాంచీల వారీగా, సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

మొత్తంగా రాష్ట్రంలోని 260 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,22,786 సీట్లు ఉండగా, కన్వీనర్ కోటాలో 86,862 సీట్ల (70 శాతం) భర్తీకి ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. ఇందులోప్రభుత్వ కాలేజీల్లో 3,041 సీట్లు ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో 83,821 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఇక మేనేజ్‌మెంట్ కోటాలో 35,923 సీట్లు ఉన్నట్లు తెలిపింది. కాలేజీలను మూడు కేటగిరీలుగా విభజించి వెబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చిన కాలేజీలకు ఆకు పచ్చ (లైట్ గ్రీన్) రంగు కేటాయించారు.

వీటిని ఎలాంటి వివాదం లేని, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీలుగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఈనెల 20 నుంచి చేపట్టబోయే తనిఖీ నివేదికలకు లోబడి వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చిన కాలేజీలకు నీలి రంగు (లైట్ బ్లూ) కేటాయించారు. తనిఖీల్లో అన్ని ఫ్యాకల్టీ అన్ని సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే వాటికి అనుబంధ గుర్తింపు లభిస్తుంది. కోర్టును ఆశ్రయించకుండా త్వరలో చేపట్టే తనిఖీ నివేదికలకు కట్టుబడి ఉంటామని లేఖలు అందజేసిన కాలేజీలకు ఉదారంగు (లైట్ పర్పుల్) కేటాయించారు.

వీటిల్లోనూ ఫ్యాకల్టీ సదుపాయాలు ఉన్నట్లు తేలితేనే అనుబంధ గుర్తింపు వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఆయా రంగుల్లోని కాలేజీల జాబితాలను పరిశీలించుకున్నాకే కాలేజీలను ఎంచుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేప్పుడు ఆయా కాలేజీలకు, వాటిలోని కోర్సులకు కూడా పైన పేర్కొన్న రంగులు ఉంటాయని, వాటిని పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
 
ఏ రోజు ఎంత ర్యాంకు వరకు..?
శుక్రవారం నుంచి ఈనెల 19 సాయంత్రం 5 గంటల వరకు ఒకటో ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19 సాయంత్రం 5 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు 44,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అన్ని ర్యాంకుల వారు 22వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు 44 వేల ర్యాంకులోపు వారిలో 32,857 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఉన్నారని, అందులో శుక్రవారం మొదటి రెండు గంటల్లో 10,298 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు