-

భర్త వేధింపులతో మెడికో ఆత్మహత్య

12 Jan, 2016 11:15 IST|Sakshi
అనంతపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం వేధిస్తుండడంతో మనస్థాపం చెందిన ఓ వివాహిత మంగళవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం పట్టణంలో జరిగింది. అనంతపురం పట్టణానికి చెందిన చంద్ర, లక్ష్మి దంపతుల కుమార్తె మీనాక్షి బెంగుళూరులో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన శ్రీనివాస్‌ను పెళ్లిచేసుకుంది. దాంతో తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకున్నారు. ఆస్తిలో హక్కులేకుండా రాయించుకుని వారు అమెరికా వెళ్లిపోయారు.
 
అప్పటి నుంచి మీనాక్షి భర్త శ్రీనివాస్‌తో అనంతపురంలోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటోంది. క్లాసులు ఉన్నప్పుడు బెంగుళూరు వెళ్లి వస్తోంది. వీరికి నాలుగు నెలల చిన్నారి ఉంది. తను ఆశించిన ఆస్తి దక్కకపోవడంతో మద్యానికి అలవాటుపడిన శ్రీనివాస్ భార్యను తరుచూ వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి మంగళవారం వేకువజామున ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రంతా బార్‌లో గడిపిన శ్రీనివాస్ వేకువజామున ఇంటికొచ్చి చూస్తే భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాడు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు