జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్‌ బ్రెయిలీ’ అవార్డు

16 Nov, 2019 05:45 IST|Sakshi

సనత్‌నగర్‌: బేగంపేట మయూరీ మార్గ్‌లోని ‘దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌’ కరస్పాండెంట్‌ ఎ.జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్‌ బ్రెయిలీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇన్‌ ది కంట్రీ–2019’ అవార్డు దక్కింది. అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించనుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్‌ 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకో నున్నారు. సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిలో ఆమె వేల సంఖ్యలో పుస్తకాల ప్రచురణ చేశారు. గత 27 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, సందేశాత్మక, మహనీయుల చరిత్రలనూ బ్రెయిల్‌ లిపిలో అందించారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అంధు లకు ఈ పుస్తకాలను ఉచితంగా అందించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, జనరల్‌ నాలెడ్జ్‌ బుక్స్, కథల పుస్తకాలు, సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్, వివేకానంద వంటి మహనీయుల చరిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇంగ్లిష్‌ భాషలో బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రచురించి దేశవ్యాప్తంగా లైబ్రరీలకు అందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లా డుతూ.. అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. సాధారణ విద్యార్థులతో పోటీపడేలా అంధ విద్యార్థులను చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు.

మరిన్ని వార్తలు