14,721 పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

11 Jul, 2016 03:46 IST|Sakshi

- నోటిఫికేషన్ జారీ..
- ‘స్పాట్’లో చేరే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు
 
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిపోయిన 14,721 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు పాలిసెట్ ప్రవేశాల కమిటీ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కాలేజీల వారీగా ఖాళీల వివరాలను ఈనెల 14న పాలిసెట్ వెబ్‌సైట్‌లో (్టటఞౌడఛ్ఛ్టి.జీఛి.జీ) వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు విద్యార్థులు 14 నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, సంబంధిత విద్యా సంస్థల్లో 20వ తేదీన స్పాట్ అడ్మిషన్లను నిర్వహించాలని తెలిపింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 12న తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్పాట్ అడ్మిషన్లలో భాగంగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని పేర్కొన్నారు. కాగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెల్లడి కాకముందే ప్రభుత్వ కౌన్సెలింగ్‌ను ముగించి, స్పాట్ అవకాశం ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఉత్తీర్ణులైన వారు స్పాట్‌లో పాలిటెక్నిక్‌లో చేరితే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకుండా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు 13 వరకు పెంపు...
 ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రవేశాల కమిటీ పొడిగించింది. అన్ని ర్యాంకుల వారిలో ఇప్పటివరకు ఆప్షన్లు ఇచ్చుకోని వారు తాజాగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, ఆప్షన్లు ఇచ్చుకున్న వారు మార్పులు చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ వెల్లడించింది. అవసరమైతే 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు 16న సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 68,186 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 65,297 మంది 32,33,074 వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

 రేపు ఈసెట్ సీట్ల కేటాయింపు
 పాలిసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ఈనెల 12న ప్రకటించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 16,786 మందిలో 8,703 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు