రేపు వెబ్ ఆప్షన్లకు చివరి గడువు
సాక్షి, హైదరాబాద్: ఐసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్లో భాగంగా ఇదివరకు హాజరు కానీ విద్యార్థులు ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈనెల 11వ తేదీలోగా సర్టిఫికేషన్ చేయించుకోవచ్చని ప్రవేశాల కమిటీ తెలిపింది. విద్యార్థులు ఈనెల 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. సోమవారం వరకు 32,283 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారని, అందులో 21,293 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు తెలిపింది. ఇక ఎంబీఏ, ఎంసీఏలో కన్వీనర్ కోటాలో 23,358 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అందులో ఎంబీఏలో 21,281 సీట్లు, ఎంసీఏలో 2,077 సీట్లు ఉన్నట్లు వివరించింది.
హరితహారంలో భాగస్వాములుకండి..
రాష్ట్రంలోని అన్ని కాలేజీల విద్యార్థులు ఈనెల 15న ప్రారంభించే హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలను కాలేజీలకు యూనివర్సిటీ జారీ చేయాలని వైస్ చాన్స్లర్లకు సూచించారు. యూనివర్సిటీల్లోనూ వైస్ చాన్స్లర్లు, విద్యార్థులు, అధ్యాపకులు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలని పేర్కొన్నారు.