ఏటీఎంలో వంద డ్రా చేస్తే.. రూ.500 వస్తోంది!

25 Dec, 2016 11:40 IST|Sakshi
ఏటీఎంలో వంద డ్రా చేస్తే.. రూ.500 వస్తోంది!

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఓ ఏటీఎం నుంచి డబ్బుల వర్షం కురిపించింది. ఏటీఎం నుంచి రూ.100 విత్ డ్రా చేసేందుకు చూడగా ఆశ్చర్యకరంగా రూ.500 నోటు వచ్చింది. ఈ విషయం తెలియడంతో మరికొందరు ఏటీఎం వద్దకు చేరుకుని ఆ విధంగా డ్రా చేసుకుని తమదారిన తాము వెళ్లిపోయారు. దాదాపు రూ.8 లక్షల మేర నగదు డ్రా అయినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులోకి వెళ్లే వద్ద ఉన్న రెండో గేటు సమీపంలోని కోటక్ మహీంద్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలో ఓ వ్యక్తి శనివారం సాయంత్రం రూ.2500 డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అతనికి రూ.2000 నోటు ఒకటి వచ్చింది. దాంతోపాటు ఇంకా రావాల్సిన ఐదు వందలకు రూ.100 నోట్లు 5 రావాల్సి ఉండగా రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. అంటే మొత్తం రూ.4,500లు వచ్చాయి.

దీంతో ఏటీఎం వద్ద క్యూలో నిలుచున్న మిగతా వారు కూడా ఇలాగే డ్రా చేసుకుని వెళ్లిపోయారు. ఈ విధంగా దాదాపు 40 నిమిషాలపాటు జరిగింది. చివరకు ఎయిర్‌పోర్టు అధికారులు గమనించి బ్యాంకు వారిని రప్పించి ఏటీఎంను తాత్కాలికంగా మూసివేయించారు. అప్పటికే సుమారు రూ.8 లక్షల మేర డ్రా అయి ఉంటాయని ఎయిర్‌పోర్టు అధికారులు, బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. అయితే సాంకేతిక లోపాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.