563 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్

27 Aug, 2015 23:22 IST|Sakshi

అక్టోబరు 25న రాత పరీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. టీఎస్‌పీఎస్‌సీ తొలి నోటిఫికేషన్‌లో 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల (ఏఈఈ) భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసిన కమిషన్ గురువారం ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన కమిషన్ సమావేశంలో ఈ నోటిఫికేషన్ జారీకి నిర్ణయం తీసుకుంది.


ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యర్థులను ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు ముందుగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తరువాత దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 25వ తేదీన రాత పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని వార్తలు