1,032 పోస్టులకు 8 లక్షల దరఖాస్తులు

28 Sep, 2016 02:27 IST|Sakshi

-     గ్రూపు-2 పరీక్షకు దరఖాస్తుల వెల్లువ
-     ఇతర రాష్ట్రాల వారు 23,628 మంది

 
 సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ రాని విధంగా తెలంగాణలో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. 1,032 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈనెల 26 వరకు దరఖాస్తులను స్వీకరించగా, 8,18,926 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చివరి గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియడంతో కొంత మంది అభ్యర్థుల ఫీజు చెల్లింపు వివరాలు ఆయా బ్యాంకుల నుంచి ఇంకా అందలేదు. బుధ, గురువారాల్లో అవీ అందనున్నాయి.
 
 ఏపీ నుంచి 11,346 మంది
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 11,346 మంది పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 200 నుంచి 300 మంది చొప్పున దరఖాస్తు చేశారు. కేరళ, మధ్యప్రదేశ్, తమిళ నాడు అభ్యర్థులు ఒక్కో రాష్ట్రం నుంచి 100 మందికిపైగా దరఖాస్తు చేశారు. మొత్తంగా ఇతర రాష్ట్రాల వారు 23,628 మంది దరఖాస్తు చేసుకున్నారు.
 
 కరీంనగర్ నుంచి అత్యధికం
 గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి ఎక్కువ మంది (1,15,315) దరఖాస్తు చేసుకున్నారు. తక్కువ దరఖాస్తులు నిజామాబాద్ జిల్లా నుంచి 48,015 వచ్చాయి.

>
మరిన్ని వార్తలు