బాలిక శీలానికి వెల కట్టారు!

6 May, 2016 18:17 IST|Sakshi
బాలిక శీలానికి వెల కట్టారు!

రూ.2.50 లక్షలుగా నిర్ణయించిన పెద్దలు
9 నెలలుగా ఐదుగురు లైంగిక దాడి
నిందితుల్లో తండ్రీకొడుకులు.. గర్భం దాల్చిన బాలిక
నిందితుల్లో ఒకరు పెళ్లి చేసుకోవాలని పెద్దల తీర్పు
నిందితులపై నిర్భయ కేసు నమోదు

 
కాసిపేట: అభంశుభం తెలియని ఓ బాలికపై ఐదుగురు కామాంధులు తొమ్మిది నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ ఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడలో ఆల స్యంగా వెలుగుచూసింది. లైంగిక దాడికి పాల్పడిన వారిలో తండ్రీకొడుకులూ ఉన్నారు. పల్లంగూడకి చెందిన బాలిక కాసిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటోంది. గతేడాది ఆమె తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసిపేట పాఠశాలకు రోజూ ఆటోలో వచ్చి వెళ్తుం డేది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన ఆటోడ్రైవర్ చిర్రకుంట మహేందర్ మాయమాటలు చెప్పి 9నెలల క్రితం ఆమెను లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమెపై నిత్యం లైంగిక దాడికి పాల్పడుతూ వాంఛ తీర్చుకుంటూనే ఉన్నాడు. తన మిత్రుడైన అట్కపురం విజయ్ కోరికను కూడా తీర్చాలని బాలికను బలవంతపెట్టి.. అతడి కోరికనూ తీర్చుకున్నాడు. ఇది గమనించిన నేతుల ప్రశాంత్, తాళ్లపల్లి సంతోష్ కూడా బాలికను లైంగికంగా లొంగదీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆటోడ్రైవర్ మహేందర్ ఇంటికి వచ్చిన బాలికను అతని తండ్రి అరవై ఏళ్ల వృద్ధుడైన చిర్రకుంట లచ్చులు సైతం ఆమెను శారీరకంగా అనుభవిస్తూ వచ్చాడు.  తండ్రి, కొడుకులతోపాటు మరో ముగ్గురు యువకులు ఆమెపై 9 నెలలుగా లైంగికంగా దాడి కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో ఈ నెల 2న తల్లిదండ్రులు బాలికను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక ఏడో నెల గర్భవతిగా గుర్తించారు. ఆ మాట విని తల్లిదండ్రులు లబోదిబోమని బాలికను నిలదీయగా తనపై లైంగిక దాడికి పాల్పడిన ఆ ఐదుగురి వ్యక్తుల పేర్లు వెల్లడించింది. దీంతో బాలికపై సామూహికంగా జరిగిన లైంగిక దాడి ఘటన వెలుగుచూసింది.

నిందితులపై నిర్భయ కేసు..:  బాలికపై ఐదుగురు వ్యక్తులు తొమ్మిది నెలల నుంచి లైంగిక దాడి చేస్తున్న ఘటనను ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు నిర్ఘాం తపోయారు. గుట్టు చప్పుడు కాకుండా గ్రామపెద్దలు పంచాయితీ నిర్వహించి ఆమె శీలానికి వెల కట్టిన విషయం బయటకు పొక్కడంతో గురువారం పోలీ సులు బాధితురాలి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఈ మేరకు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన మహేందర్, అతడి తండ్రి చిర్రకుంట లచ్చులు, అట్కపురం విజయ్, నేతుల ప్రశాంత్, తాళ్లపల్లి సంతోష్‌లపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు దేవాపూర్ ఎస్సై కె.స్వామి తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితులు.?
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన వెలుగుచూసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. .
 
పంచాయితీ పెట్టి.. వెల కట్టి..
కుమార్తెపై జరిగిన దారుణ ఘటనకు మనస్తాపం చెందిన తల్లిదండ్రులు న్యాయం కోసం గ్రామ పెద్దలను ఆశ్రయించారు. ఈ నెల 3న గ్రామ, కుల పెద్దలు కలిసి పంచాయితీ నిర్వహించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి, కొడుకులతోపాటు మరో ముగ్గురు యువకులను పంచాయతీకి పిలిపించి విచారించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, మరో వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలని తీర్పునిచ్చారు. బాధితురాలిని వివాహం చేసుకునే వ్యక్తి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. ఇందుకు నిందితులెవరూ అంగీకరించకపోవడంతో ఏకమొత్తంగా రూ.2.50 లక్షలు చెల్లించాలని బాలిక శీలానికి పంచాయితీ పెద్దలు వెల కట్టారు. ఈ క్రమంలో పంచాయతీలో న్యాయం జరగక బాధిత కుటుంబం తీవ్ర వేదనకు గురైంది.

మరిన్ని వార్తలు