సహజీవనం చేస్తున్న యువతితో గొడవపడి...

14 Apr, 2016 22:46 IST|Sakshi
సహజీవనం చేస్తున్న యువతితో గొడవపడి...
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన మహ్మద్ రఫీ (29) పోలీస్ శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏడాదిన్నర కిందట సస్పెండ్‌ అయ్యాడు. రఫీకి కరీంనగర్‌కు చెందిన కవిత అనే బీ-ఫార్మసీ చదివిన మహిళ పరిచయమైంది. వీరిద్దరూ ప్రేమించుకుని గత రెండు సంవత్సరాలుగా పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 
 
ఇద్దరి మధ్య స్వల్ప గొడవలు జరగడంతో గురువారం కవిత తన ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధపడింది. రఫీ వద్దని వారించినా వినకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి బయట ఉన్న కవిత ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపు పగులగొట్టి అతన్ని కిందకు దింపి సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రఫీ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు