సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులకు పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో ఆధార్ నమోదు చేపట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యాశాఖకు రిజిస్ట్రార్ స్టేటస్ ఇచ్చేందుకు అంగీకరించింది. త్వరలోనే ఆ స్టేటస్ లభించనుంది. దీంతో ఇకపై విద్యార్థుల ఆధార్ నమోదు, ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ అప్డేట్ చేయడం వంటి పనులను విద్యాశాఖ చేపట్టనుంది అయితే ఆధార్ నమోదు ఏజెన్సీలకు విద్యాశాఖ ఈ బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 58 లక్షల మంది విద్యార్థుల్లో 54 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆధార్ను విద్యాశాఖ చైల్డ్ ఇన్ఫోతో అనుసంధానం చేసింది. మిగతా వారి ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఐటీ శాఖ అధికారులతోనూ విద్యాశాఖ అధికారులు సమావేశం అయ్యారు. విద్యాశాఖ స్వయంగా ఈ పనులను చేయించడం ద్వారా పక్కాగా ఆధార్ అప్డేషన్ సాధ్యం అవుతుందని భావిస్తోంది.