సాక్షి, హైదరాబాద్: క్రీడా, యువజన శాఖ మంత్రి పద్మారావును బ్రెజిల్ రాయబారి తోవర్ దా సిల్వ నున్స్ ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ–బ్రెజిల్ మధ్య అధునాతన క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడలకు సంబంధించి భారీ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించారు.అనంతరం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో బ్రెజిల్ బృందం వేర్వేరుగా భేటీ అయింది.
మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం అనుసరిస్తున్న కృత్రిమ గర్భధారణ సాంకేతిక సహకా రాన్ని అందించాలని బ్రెజిల్ బృందాన్ని పార్థసారథి కోరారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల్లో సాంకేతిక సహకారాన్ని అందించాలన్నారు.పర్యాటకంలో పరస్పర సహకారం: బ్రెజిల్లో పురావస్తు అధ్యయనాలు, తవ్వకా లల్లో భారత్ సహకారం, భారత్లో ఫుట్బాల్ లాంటి క్రీడలను ప్రోత్సహించేందుకు బ్రెజిల్ సహకారంపై పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బ్రెజిల్ రాయబారి తొవర్ బృందంతో చర్చించారు. ఎండీ దినకర్బాబు, బ్రెజిల్ రాయబారితో పాటు ప్రతినిధి బృందం జోస్ ఓటవియో లేమోస్, ఆచార్య ప్రమేయ చైతన్య జీ, ఆచార్య గన్ శ్యామ్ వ్యాస్ జీ తదితరులు పాల్గొన్నారు.