నిమ్స్‌కు అగర్వాల్‌ సమాజ్‌ బహుమానం

11 Feb, 2018 03:03 IST|Sakshi

ఐసీయూని అందజేసిన అగర్వాల్‌ సేవా ట్రస్ట్‌

నేడు ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యశాలలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోన్న అగర్వాల్‌ సమాజ్‌ సహాయత సేవా ట్రస్ట్‌ తాజాగా నిమ్స్‌ ఆస్పత్రికి పూర్తిస్థాయి ఐసీయూని బహుమానంగా అందజేసింది. నిమ్స్‌ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించనున్న మెగా హెల్త్‌ క్యాంపు సందర్భంగా ఈ నూతన ఐసీయూని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. సుమారు రూ.60 లక్షల విలువైన ఈ అత్యాధునిక ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో 5 వెంటిలేటర్లు, 7 మానిటర్లు, 6 వీల్‌ చైర్లు, 2 ట్రాలీలు, వెయిటింగ్‌ రూమ్‌ వద్ద స్టీల్‌ సోఫా సెట్లు, 2 ఎల్‌ఈడీ టీవీలు ఉన్నాయి.

‘ఇది వరుసగా రెండో మెగా హెల్త్‌ క్యాంపు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రికి డయాలసిస్‌ మెషీన్‌ను అందజేశాం. ఇప్పుడు నిమ్స్‌కి పూర్తిస్థాయి ఐసీయూని ఇస్తున్నాం. వచ్చే మెగా క్యాంపు నాటికి ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి మొబైల్‌ యూనిట్స్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అందించే పరికరాలు, సదుపాయాలు నిజమైన పేదవారికి అందుతాయి. అది మా ట్రస్ట్‌కి ఎంతో సంతోషం కలిగించే అంశం’అని అగర్వాల్‌ సమాజ్‌ సేవా ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ రాజేశ్‌ అగర్వాల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు