సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో నేటి (ఆదివారం) నుంచి 7 వరకు జరగనున్న సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభల షెడ్యూల్ను ఆ పార్టీ నాయకత్వం శనివారం వెల్లడించింది. మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సభలను సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రారంభిస్తారని తెలిపింది. అంతకు ముందు ఉదయం 11.30కు మేకల అభివన్ స్టేడియం నుంచి ఎర్రసేన కవాతు ప్రారంభమై, సభ జరిగే లక్ష్మీగార్డెన్స్ గ్రౌండులో మధ్యాహ్నం 1.30కు ముగుస్తుంది.
తొలిరోజు సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొంటారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసీపీఐ(యు), ఎస్యూసీఐ(సి), సీపీఐ–ఎంఎల్ పార్టీలకు చెందిన ఒక్కో నేత సౌహార్ధ సందేశాలు ఇస్తారు. 5, 6, 7 తేదీల్లో ప్రతినిధుల సమావేశాలు, ఆఖరి రోజు నూతన నాయకత్వాన్ని పరిచయం చేయడంతో మహాసభలు ముగుస్తాయని తెలిపింది.