‘ఫిర్యాదు ఇవ్వబోతే ఎస్‌ఐ చితక్కొట్టాడంటూ...’

27 Apr, 2016 13:59 IST|Sakshi

హయత్‌నగర్: ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎస్‌ఐ కంప్లైంట్ తీసుకోకపోగా, తనను చితక్కొట్టాడంటూ ఓ బాధితుడు ఎల్‌బీనగర్ డీసీపీకి బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం హన్మగల్‌కు చెందిన తనకు, తన కుటుంబ సభ్యులకు కారు విషయమై వివాదం నడుస్తోందని.. ఇదే విషయమై తండ్రి పెంటయ్య, సోదరుడు సురేష్ ఈ నెల 24న తనపై దాడి చేసి కొట్టారని బాధితుడు పేర్కొన్నాడు.

ఫిర్యాదు ఇవ్వడానికి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని... ఎస్‌ఐ చంద్రశేఖర్ తొలుత తన తండ్రి పెంటయ్యతో మాట్లాడి ఆ తర్వాత తనపై విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారని, బూటు కాళ్లతో తొక్కి బెదిరించాడని బాధితుడు తెలిపాడు. అంతేకాక  ఫిర్యాదు కూడా తీసుకోలేదని, జేబులో ఉన్న రూ.19,500 తీసుకున్నారని ఆరోపిస్తున్నాడు. తనకు పెంటయ్య, సురేశ్‌లతోపాటు వారితో కుమ్మక్కు అయిన ఎస్‌ఐ చంద్రశేఖర్నుంచి ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డీసీపీని కోరాడు.

మరిన్ని వార్తలు