జగన్పై జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం: అంబటి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుది రాక్షస మనస్తత్వమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. హత్యలు చేయించిన చరిత్ర, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అధికారపక్షం తీవ్రస్థాయిలో బురదజల్లుతోందని మండిపడ్డారు. తాము చేసిన గొప్ప పనులు ఏమైనా ఉంటే చెప్పుకోవాలి కానీ జగన్పై అవాకులు చెవాకులు మాట్లాడ్డం సరికాదని హితవు పలికారు.
జగన్ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి దారుణంగా మాట్లాడడంపై అంబటి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అభ్యంతరకర పదజాలం వాడడంలో ప్రభాకర్రెడ్డి తన అన్న జేసీ దివాకర్రెడ్డిని మించిపోయాడన్నారు. ‘దివాకర్’ బస్సు ప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ.. అవి జేసీ సోదరులు చేసిన హత్యలుగానే పరిగణించి, వారిని తక్షణమే అరెస్టు చేయాలని అంబటి డిమాండ్ చేశారు. చంద్రబాబు సమక్షంలో జేసీ దివాకర్రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిని వాడకూడని పదజాలంతో దూషించారని, దాని కన్నా ఐదారు డిగ్రీలు ఎక్కువగా ప్రభాకర్రెడ్డి జగన్ను ఉద్దేశించి మాట్లాడారని మండిపడ్డారు.
తన సమక్షంలోనే దివాకర్రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే చంద్రబాబు ఆ మాటలను సంగీతంలా ఆస్వాదించారన్నారు. తెలంగాణలో టీడీపీ నేత నర్సిరెడ్డి అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఇలాగే మాట్లాడితే చంద్రబాబు ఆనందంగా విన్నారన్నారు. అందుకే కేసీఆర్ ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నడుం విరగొట్టారని అంబటి ఎద్దేవా చేశారు. బూతులు తిట్టే స్ధాయికి టీడీపీ నేతలు వచ్చారంటే వారి వద్ద పసలేనట్టేనని అభిప్రాయపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వర్లరామయ్య, జేసీ సోదరులు, చింతమనేని ప్రభాకర్ తదితరులు చంద్రబాబు దృష్టిలో దేవుళ్లా.. మేమంతా రాక్షసులమా అని సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబుది హత్యారాజకీయం..: చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో హత్యలు జరిగాయని అంబటి అన్నారు. వంగవీటి మోహన్రంగాను హతమార్చితే తప్ప విజయవాడలో ముందుకు వెళ్లలేమని కుట్ర చేసి హత్య చేశారని, జర్నలిస్టు పింగళి దశరధరామ్ను, ఎన్టీ రామారావు వద్ద కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును చంద్రబాబు హత్య చేయించారని విమర్శించారు. మల్లెల బాబ్జీని హత్య చేయించింది చంద్రబాబు బృందమేనని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణం తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావును దగ్గరకు తీసుకుని ఆ తర్వాత ఎక్కడికి పంపారో అందరికి తెలుసన్నారు. రక్తం పంచుకుని పుట్టిన నారా రామ్మూర్తినాయుడు.. చంద్రబాబును ఛీకొట్టి కాంగ్రెస్లో చేశారని చెప్పారు. రాజకీయాల్లో ఇంత రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనన్నారు.