రాష్ట్రంలో మరో 24 ఎత్తిపోతల పథకాలు

16 Sep, 2017 03:27 IST|Sakshi
ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదట్లో ప్రారంభం 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలో మరో 24 ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 582 ఎత్తిపోతల పథకాలు ఉండగా, అదనంగా మరో 74 పథకాలను ఐడీసీ గతంలోనే చేపట్టింది. ఎత్తిపోతల పథకాల కింద మొత్తంగా 4.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, ప్రస్తుతం 1.23 లక్షల ఎకరాలకు నీరందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత వాటికి మరమ్మతులు చేపట్టడంతోపాటు కొత్త వాటిని పూర్తి చేయాలని నిర్ణయించిన ఐడీసీ ఆ దిశలో పనులు చేస్తోంది.

ఈ రబీలో కొత్తగా చేపట్టిన 74 పథకాల్లో 45 పూర్తిచేసి 70వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ 45 పథకాల్లో తొలుత 24 పథకాలను ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికి ప్రారంభించి 37వేల ఎకరాలకు నీరందించాలని ఐడీసీ భావిస్తోంది. ఇందులో జగిత్యాల జిల్లాలో రాయటప్నం, తిమ్మాపూర్, రాజారాం, జైనా, దొంతాపూర్‌ పథకాలు ఉండగా, పెద్దపల్లి జిల్లాలో కాశిపేట, కరీంనగర్‌లో ఉట్నూరు, భూపాలపల్లిలో గిద్దముత్తారం, నిజామాబాద్‌ జిల్లాలో గుమ్మిర్యాల, కుక్కునూరు, నిర్మల్‌లో వెల్మల్, సంగారెడ్డిలో బోగులంపల్లి, గద్వాల్‌లో అలంపూర్, సూర్యాపేట జిల్లాలో ఎర్రగుట్టతండా, చౌట్‌పల్లి, పొనుగోడు, మఠంపల్లి, ముదిమాణిక్యం, సున్యపహాడ్, గుట్టలగడ్డ, కొత్తగూడెం జిల్లాలో సింగిరెడ్డిపల్లి, అల్లపల్లి, పాములపల్లి, మోతెలో ఈ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జగిత్యాలలోని రాయపట్నం, తిమ్మాపూర్‌ పథకాలను అధికారులు ప్రారంభించారు. 
మరిన్ని వార్తలు