ముగిసిన బీఏసీ సమావేశం, 16 రోజులే అసెంబ్లీ

5 Mar, 2016 16:55 IST|Sakshi
ముగిసిన బీఏసీ సమావేశం, 16 రోజులే అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కేవలం 16 పనిదినాల పాటు మాత్రమే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 30వ తేదీ వరకు సమావేశాలు ఉంటాయని తెలిపారు. అసెంబ్లీ కార్యకలాపాల షెడ్యూలును నిర్ణయించేందుకు బీఏసీ సమావేశం అసెంబ్లీలో శనివారం జరిగింది. ఈనెల 10వ తేదీనే సాధారణ, వ్యవసాయ బడ్జెట్లు రెండూ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 9వ తేదీన సమాధానం ఇస్తారు. బడ్జెట్‌పై చర్చకు ఈనెల 17న ఆర్థికమంత్రి సమాధానం ఇస్తారు. సమావేశాలు ఈనెల 30 వరకు ఉంటాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు తెలిపారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాలని స్పీకర్ సూచించారని ఆయన చెప్పారు.

వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి సమావేశాలను 40 రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టారు. 25 ప్రధానాంశాలపై చర్చ జరగాలని వైఎస్ఆర్‌సీపీ సూచించింది. తాము 40 రోజులు అసెంబ్లీ ఉండాలని సూచించినా అధికారపక్షం పట్టించుకోలేదని సమావేశం అనంతరం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే వాయిదా తీర్మానాల ప్రతిపాదన సమావేశాల మొదట్లోనే ఉండాలని తాము పట్టుబట్టామన్నారు. రూల్స్ కమిటీలో సవరణలు ఏవీ జరగలేదు కాబట్టి, మునుపటిలాగే వాయిదా తీర్మానాలను చేపట్టాలని కోరామన్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు