ఆ ప్రభావం ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా?

11 Jun, 2016 20:24 IST|Sakshi

- ఏపీకి వెళ్లేవారికి స్థానికతపై రాష్ట్రపతి ఆమోదం
- ఎంసెట్‌లో వారిని ఎలా పరిగణించాలన్న దానిపై అయోమయం

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఆ రాష్ట్ర స్థానికతను వర్తింపచేసేలా శుక్రవారం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌పై పడుతుందా? ఏపీ ఎంసెట్ రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఏపీకి వెళ్తే కనుక అక్కడి స్థానికత ఆధారంగా వారికి లోకల్ కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారవర్గాల్లోనూ తర్జనభర్జన సాగుతోంది. గతనెలలో జరిగిన ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ (ఓయూ రీజియన్) నుంచి దాదాపు 42,482 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 18,892 మంది ఇంజనీరింగ్ విభాగంలో, 23,594 మంది మెడికల్ విభాగంలో ఉన్నారు. ఇంజనీరింగ్‌లో 17,548 మంది, మెడికల్ విభాగంలో 22,591 మంది పరీక్ష రాశారు. వీరిలో అత్యధిక శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టాప్‌ర్యాంకుల్లో అధికం వీరికే వచ్చాయి. ఇంజనీరింగ్‌లో దాదాపు 1.60 లక్షల సీట్లుండగా, మెడికల్‌లో ఎంబీబీఎస్‌లో 3900 సీట్లు, డెంటల్ కోర్సులో 1300 సీట్లు ఉన్నాయి. వీటిలో 371 డీ ప్రకారం ఆయా రీజియన్ల పరిధిలోని సీట్లలో 85 శాతం స్థానికులకు కేటాయించాలి. 15 శాతం సీట్లు మెరిట్‌లో ఓపెన్‌టు ఆల్ ప్రాతిపదికన భర్తీచేయాలి. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి 371 డీ ప్రకారం ఏపీలోని ఆంధ్రాయూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తెలంగాణలోని ఉస్మానియా వర్సిటీల రీజియన్లుగా ఉన్నాయి. ఈ లెక్కన హైదరాబాద్‌లో, తెలంగాణలో ఇంటర్మీడియెట్ వరకు చదివి ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఏపీలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో 15 శాతం కోటా మాత్రమే వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఉస్మానియా పరిధినుంచి ఉత్తీర్ణులైన వారిని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు అదే విధంగా పరిగణించి 15 శాతం ఓపెన్ కోటాకు మాత్రమే వారిని అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఆన్‌లైన్ సీట్ల కేటాయింపులో ఆమేరకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కౌన్సెలింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 35 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆప్షన్లు నమోదు పూర్తిచేశారు. వీరిలో అత్యధిక శాతం మంది తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులున్నారు.

ఈ తరుణంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి స్థానికతను వర్తింపచేసే ఫైలుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కౌన్సెలింగ్‌పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఏపీ ఎంసెట్ రాసి అర్హత సాధించిన ఓయూ రీజియన్ అభ్యర్థుల్లో అనేక మంది తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే అవకాశముంటుందని పలువురు పేర్కొంటున్నారు. అలా అయితే వారికి ఏపీ స్థానికత వర్తిస్తుంది. అపుడు ఎంసెట్‌లో వారిని 85 శాతం స్థానిక కోటాలో సీట్లు కేటాయిస్తారా? లేక ఇంటర్మీడియెట్ హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదివినందున 15 శాతం స్థానికేతర కోటాలో సీట్లు కేటాయిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. ఏపీకి వెళ్లే ఈ విద్యార్థులకు ఏ రీజియన్ పరిధిలో స్థానికత వర్తిస్తుందన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఏపీలోని ఏయూ, ఎస్వీయూలు రెండు రీజియన్లుగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో ఎస్వీయూ పరిధిలో స్థానికత ఉన్నవారికి 15 శాతం ఓపెన్‌కోటాలో మాత్రమే కేటాయింపులు చేస్తారు. అలాగే ఎస్వీయూ పరిధిలోని సీట్లలో ఏయూ పరిధి స్థానికత ఉన్నవారిని 15 శాతం సీట్లలో మాత్రమే అనుమతిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాలి. ఆ తరువాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏ రీజియన్‌కు సంబంధించిన స్థానికత వర్తిస్తుందో తేలాలి. అప్పటికి గానీ ఆయా అభ్యర్థుల స్థానికతపై ఒక స్పష్టత రాదు. ఇందుకు చాలా సమయం పట్టనుంది. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఈనెల 22న మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల అలాట్‌మెంటు పూర్తవుతుంది. ఆలోగా ఈ వ్యవహారమంతా తేలదు. ఈ నేపథ్యంలో దీనిపై ఏంచేయాలా? అని అధికారులు ఆలోచనల్లో పడుతున్నారు. ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ అధికారులు దీనిపై స్పందిస్తూ దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్తాం. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్తాం అని వివరించారు. ఉన్నత స్థాయిలో చర్చించాకనే దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని పేర్కొన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ రాష్ట్రపతి ఉత్తర్వులు రాకముందే ప్రారంభమైనందున ఆ ఉత్తర్వులు ఈ కౌన్సెలింగ్‌కు అమలు చేయాలా? లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉందని వివరించారు.

మరిన్ని వార్తలు