అపార్ట్‌మెంట్‌లో భారీ పేలుడు

18 Dec, 2013 06:10 IST|Sakshi
అపార్ట్‌మెంట్‌లో భారీ పేలుడు

=నలుగురికి గాయాలు
 =మెదక్ జిల్లాలో ఘటన
 =ఉలిక్కిపడ్డ రామచంద్రాపురం
 =గ్యాసే కారణమంటున్న పోలీసులు!

 
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవరూ ఉండటం లేదు. రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్‌మెంట్‌లో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్ పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు సంభవించింది.

ఈ మేరకు గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్‌మెంట్‌లోని పలు ఫ్లాట్ల కిటికీ అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్‌మెంట్ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్‌లాల్ బజాజ్ డిల్లీలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నారు.

ఈ గదిలో ఎలాంటి సామగ్రి లేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చెరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు.
 
గ్యాస్‌తోనే పేలుడు!

అపార్ట్‌మెంట్‌లో పెలుడుకు కారణం గ్యాసేనని నిపుణు లు నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఇన్‌బెల్ట్ గ్యాస్ మెకానిక్ రహీం నుంచి పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. మంగళవారం గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ పరిశీలిస్తున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు సంభవించింది. అయితే ఎవరూ లేని ఆ ఫ్లాట్‌లో గ్యాస్‌వాల్ ఓపెన్ చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు