11 నుంచి నెట్‌కు దరఖాస్తులు: సీబీఎస్‌ఈ

7 Aug, 2017 02:28 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత పరీక్షకు (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు–నెట్‌) దరఖాస్తులను ఈ నెల 11 నుంచి స్వీకరించేందుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చర్యలు చేపట్టింది. నెట్‌ అర్హత వివరాలను  http:// cbsenet. nic. in   వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఆన్‌లైన్‌లో జనరేట్‌ చేసుకున్న చలానాను సెప్టెంబర్‌ 12లోగా బ్యాంకులో (సిండికేట్‌/కెనరా /ఐసీఐసీఐ/ హెచ్‌డీఎఫ్‌సీ) చెల్లించాలని, సెప్టెంబర్‌ 19 నుంచి 25లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులో దొర్లిన పొరపాట్లను సవరించు కోవచ్చని సూచించింది.

అక్టోబర్‌ మూడో వారంలో అడ్మిట్‌ కార్డు అందుబాటులో ఉంచుతామని, రాత పరీక్ష నవంబరు 5న నిర్వహిస్తామని తెలిపింది. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ అభ్యర్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులైతే 50 శాతం మార్కులు సాధించి ఉండాలని స్పష్టంచేసింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారు 2017 జనవరి 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని తెలిపింది. నెట్‌ రాయాలకునే అభ్యర్థులు తమ ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా దరఖాస్తులో నింపాల్సిందే. జమ్మూ కశ్మీర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రం ఆధార్‌ తప్పనిసరి నిబంధన వర్తించదు. వారు పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ నంబర్లు లేదా ఏదేని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు నంబర్‌ వేయవచ్చని సీబీఎస్‌ఈ వివరించింది.  
>
మరిన్ని వార్తలు