ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి
► ఏడుగురు తెలుగువారు సహా ప్రపంచ వ్యాప్తంగా 200 మందికి చికిత్స
► గ్రామాల్లో మొబైల్ ఎండోస్కోపీపై సీఎంతో చర్చిస్తామని వెల్లడి
► ముగిసిన ప్రపంచ ఎండోస్కోపీ సదస్సు.. 70 దేశాల నుంచి 4 వేల మంది హాజరు
సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపీ విధానంతో మధుమేహాన్న నిర్మూమలించవచ్చని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంస్థ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి మధుమేహాన్ని నిరూ్మలించగలిగామని.. అందులో హైదరాబాద్లోని తమ ఆస్పత్రిలో ఏడుగురు తెలుగు వారికి విజయవంతంగా నయం చేయగలిగామని పేర్కొన్నారు. 4 రోజులపాటు జరిగిన ప్రపంచ ఎండోస్కోపీ మొదటి కాంగ్రెస్ (ఎండో–2017) ఆదివారం హైదరాబాద్లో ముగిసింది. ఈ సందర్భంగా పలుదేశాలకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులతో కలసి నాగేశ్వర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
70 దేశాల నుంచి 4 వేల మంది వైద్యులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. 600 మంది తమ పరిశోధన పత్రాలను సమర్పించారని చెప్పారు. డీఎంఆర్ అనే అత్యాధునిక వైద్య ప్రక్రియ ద్వారా తాము చిన్నపేగులోని మొదటి భాగంలో అంతర్గత పొరను ఎండోస్కోపీ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా తొలగిస్తే ఆ హార్మోన్ సైకిల్ బ్రేక్ అవుతుందని, దీంతో డయాబెటిక్ నయమవుతుందని స్పష్టంచేశారు. ఈ చికిత్స చేశాక మందులు అవసరమే లేదన్నారు. తాము డీఎంఆర్ చేసిన ఒక వ్యక్తి 3 నెలల్లో 10 కేజీల బరువు తగ్గి డయాబెటిక్ నుంచి విముక్తి పొందారని, రూ.80 వేలకు ఈ డయాబెటిక్ చికిత్స చేయవచ్చని తెలిపారు. డయాబెటిక్ చికిత్స పూర్తిస్థాయిలో చేయడానికి అనువైన క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని వివరించారు.
గ్రామాలో్లకి మొబైల్ ఎండోస్కోపీల కోసం సీఎం కేసీఆర్తో చర్చిస్తా..
దేశంలో పసిరికలు, అల్సర్స్, కడుపులో కేన్సర్లు ఎక్కువవుతున్నాయని నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. శస్త్రచికిత్స ద్వారా కాకుండా ఎండోస్కోపీ పద్ధతిలో అన్ని రకాల కేన్సర్లను నయం చేయవచ్చని చెప్పారు. చిన్నపేగులను గతంలో చూడలేకపోయేవారమని.. స్పైరల్ ఎండోస్కోపీతో చూడవచ్చని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి ఎండోస్కోపీ వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు గ్రామాల్లో మొబైల్ వ్యాన్ల ఏర్పాటు విషయాన్ని చర్చిస్తానన్నారు.
ప్రపంచ ఎండోస్కోపీ సంస్థ (డబ్ల్యూఈవో) అధ్యక్షుడు, అమెరికాకు చెందిన డాక్టర్ ఫ్యాబియర్ ఎమురా మాట్లాడుతూ, నాలుగు రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండోస్కోపీ వైద్య విధానంలో వచ్చిన నూతన ఆవిష్కరణలను చర్చించామన్నారు. వచ్చే కాంగ్రెస్ దక్షిణ కొరియాలో జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు డబ్ల్యూఈవో అధ్యక్షుడిగా పనిచేసిన నాగేశ్వర్రెడ్డి దీన్ని ఎంతో ఉన్నతస్థాయికి తీసుకెళ్లారన్నారు. నార్వేకు చెందిన డాక్టర్ లార్స్ ఆబాక్కర్, జర్మనీకి చెందిన డాక్టర్ హార్స్ట్ నియోహాస్, ఫ్రాన్స్ కు చెందిన డాక్టర్ జీన్ ఫ్రాన్సియోస్ రే, కెనడాకు చెందిన రాబర్ట్ బెయిలీ, ఈజిప్టునకు చెందిన ఇబ్రహీం ముస్తఫా, అమెరికాకు చెందిన జీరోమ్ డి.వాయే తదితరులు పాల్గొన్నారు.