హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనలో భాగంగా చేపట్టిన ఆటోల సమ్మె హైదరాబాద్తో పాటు జిల్లాల్లో పాక్షిక ప్రభావం చూపింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోల యజమానులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెకు స్పందన నామమాత్రంగానే వచ్చింది. పెంచిన బీమా, ఆర్టీఏ ఫీజులను తగ్గించాలని ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా ఆటో కార్మికులు హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ర్యాలీని విరమించారు. ఏఐటీయూసీ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలపగా సుమారు లక్ష ఆటోలు రోడ్డెక్కలేదని అన్నారు. ఆటోల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు బస్సు ట్రిప్పులను పెంచారు.