ఎంబీబీఎస్ పోస్టుల్లో ఆయుష్ వైద్యులు

1 Oct, 2016 02:08 IST|Sakshi
ఎంబీబీఎస్ పోస్టుల్లో ఆయుష్ వైద్యులు

- 160 మంది ఆయుష్‌లను నియమించాలని నిర్ణయం  
- మెదక్ మినహా అన్ని జిల్లాల్లో 5న కౌన్సెలింగ్‌కు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే ప్రక్రియకు ఆటంకాలు తొలగిపోయాయి. రెండుసార్లు నోటిఫికేషన్లు, కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఎంబీబీఎస్ డాక్టర్లు అనేక చోట్ల మెడికల్ ఆఫీసర్లుగా చేరకపోవడంతో ప్రభుత్వం వాటిని ఆయుష్ వైద్యులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది.
 
 ఇప్పటికే భర్తీ చేయగా మిగిలిన 160 ఎంబీబీఎస్ పోస్టులను ఆయుష్ వైద్యులతో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఐదో తేదీన వాటికి కౌన్సెలింగ్ నిర్వహించి ఒకేరోజు (మెదక్ మినహా) అన్ని జిల్లాల్లో భర్తీ చేయాలని జిల్లా డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. కిందటేడాది ఆగస్టు 21న, ఈ ఏడాది జూలై 22వ తేదీన ఆర్బీఎస్‌కే పోస్టులకు ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఎంబీబీఎస్‌ల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకుంది.
 
 పురుష డాక్టర్లు 72... మహిళా డాక్టర్లు 88
 0-16 ఏళ్ల చిన్న పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్‌బీఎస్‌కేను ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్‌ఎన్‌సీ)ను ఏర్పాటు చేయాలనేది  ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ టీమ్‌లు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. అందుకోసం 630 మంది ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి. అయితే మెదక్ జిల్లాలో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు పూర్తిస్థాయిలో చేరారు. మిగిలిన జిల్లాల్లో 280 ఎంబీబీఎస్ డాక్టర్లకు గాను.. ఇప్పటివరకు కేవలం 120 మంది మాత్రమే చేరారు. మిగిలిన 160 చోట్ల ఎంబీబీఎస్ డాక్టర్లు చేరలేదు.
 
 దీంతో వాటన్నింటినీ ఆయుష్ వైద్యులతో నింపుతారు. అందులో పురుష డాక్టర్లు 72, మహిళా డాక్టర్లు 88 మందికి అవకాశం కల్పించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 17 మంది పురుష, 16 మంది మహిళా ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తారు. నిజామాబాద్ జిల్లాలో 12 పురుష, 14 మంది మహిళా ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను నియమిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది పురుష, 12 మంది మహిళ, హైదరాబాద్‌లో 8 మంది పురుష, 10 మంది మహిళ , కరీంనగర్ జిల్లాలో 7 పురుష, 10 మంది మహిళ, వరంగల్ జిల్లా లో 5 పురుష, 10 మంది మహిళ, ఖమ్మం జిల్లాలో 4 పురుష, 9 మంది మహిళ, నల్లగొండ జిల్లాలో నలుగురు చొప్పున  పురుష, మహిళ, రంగారెడ్డి జిల్లాలో 4 పురుష, 3 మహిళా మెడికల్ ఆఫీసర్లను ఆయుష్ వైద్యులతో నియమిస్తారు.

>
మరిన్ని వార్తలు