మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి బెయిలబుల్ వారెంట్

20 Jun, 2016 21:03 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై చేసిన ఫిర్యాదులో భాగంగా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి నాంపల్లి సీసీఎస్ కోర్టు సోమవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూలై 11న కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి డ్యానీరూథ్ విచారణ వాయిదా వేశారు. తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరినాథ్‌రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు.

హరినాథ్‌రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రకిరణ్‌రెడ్డి సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును విచారణకు చేపట్టిన కోర్టు...ఫిర్యాదుదారుగా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డికి వాంగ్మూలం ఇవ్వాలంటూ కోర్టు సమన్లు జారీచేసింది. సమన్లను సీసీఎస్ అధికారులు ఇంద్రకరణ్‌రెడ్డికి అందించారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించారు. అయినా ఇంద్రకరణ్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీచేశారు.
 

మరిన్ని వార్తలు