మల్కాజ్గిరి సెంట్రల్ బ్యాంకు దోపిడీ కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ దోపిడీలో బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాళం చెవులతోనే లాకర్లను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. గతంలో బ్యాంకులో పనిచేసిన సిబ్బంది.. లేదా ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ల హస్తం ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు.
బంగారు నగలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇచ్చే బ్యాంకులో తెల్లవారుజామున చోరీ జరిగింది. తాళాలతో బ్యాంకు షట్టర్ తెరచిన గుర్తుతెలియని వ్యక్తి.. కిలో బంగారం, లక్షా 25 వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా చూస్తే.. తాళాలు తీసుకుని దర్జాగా లోపలికి వెళ్లినట్లు తేలింది. సీసీ కెమెరా ఫుటేజ్లో చోరీ చేసిన వ్యక్తి ఆచూకీ తెలుస్తోంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకు దోపిడీ గురించి తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గరకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.