సాగు ప్రాజెక్టులకు ‘దివాలా’ కష్టాలు!

20 Feb, 2018 01:34 IST|Sakshi

ప్రాజెక్టుల పనులు చేస్తున్న ఐవీఆర్‌సీఎల్‌ సంస్థపై అప్పుల భారం

ఆ కంపెనీపై దివాలా చర్యలు.. 4 ప్రాజెక్టులపై ప్రభావం

దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు తర్జనభర్జన  

సాక్షి, హైదరాబాద్‌: భారీగా రుణాలు తీసు కుని తిరిగి చెల్లించని కంపెనీలకు షాకిచ్చేలా కేంద్రం తీసుకొచ్చిన దివాలా చట్టం.. రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. దీంతో రుణాలిచ్చిన బ్యాంకులు మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు అలాంటి కంపెనీలను దివా లా కోర్టు ముందుకు తేనున్నాయి.

ఈ జాబితాలో రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న హైదరాబాద్‌ కంపెనీ ఐవీఆర్‌సీఎల్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల పనులపై పడే ప్రభావాన్ని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఈ మేర కు ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీ స్వయంగా, ఇతర కంపెనీలతో కలిసి  చేస్తున్న పనుల జాబితాను సిద్ధం చేసింది. 4 ప్రధాన ప్రాజెక్టుల పరిధిలో రూ.759 కోట్ల విలువైన పనులపై ప్రభావం పడొచ్చని తెలుస్తోంది.

ఏయే పనులపై ప్రభావం?
ఇప్పటివరకు అధికారులు సిద్ధం చేసిన నివేదిక ఆధారంగా పరిశీలిస్తే.. ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీ ఇందిరమ్మ వరద కాల్వ ప్యాకేజీ–5 పరిధిలో రూ.290.73 కోట్ల విలువైన పనులు చేస్తుండగా.. ఇంకా రూ.57.51 కోట్ల విలువైన పనులు చేయాలి. ఇదే ప్యాకేజీ పరిధిలో రీఇంజనీరింగ్‌లో భాగంగా కొత్తగా రూ.288.65 కోట్ల పనులు చేయాలి.

ఎల్లంపల్లి స్టేజ్‌–2 కింద ఫేజ్‌–1లో రూ.41.63 కోట్ల పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–20లో రూ.365.62 కోట్ల పనులు, నిజాంసాగర్‌ ఆధునీకరణ ప్రాజెక్టులో రూ.6 కోట్ల పనులు.. మొత్తంగా రూ.759 కోట్ల పనులు చేయాలని గుర్తించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ దివాలా తీస్తే.. ప్రభుత్వాల నుంచి వాటికి రావాల్సిన నిధు లు నేరుగా బ్యాంకులకు వెళతాయి. దీనివల్ల ఆ కంపెనీతో కలసి పనిచేస్తున్న కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. పనులన్నీ ఆగిపోయే ప్రమాదముందని నీటి పారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు