సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతలు, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళల కోసం సురక్ష బతుకమ్మ పేరిట ప్రత్యేకంగా బతుకమ్మ పాటలను రూపొందించారు. ఈ సీడీని డీజీపీ అనురాగ్శర్మతో పాటు సీపీ మహేందర్రెడ్డి ఇతర అధికారులు ఆవిష్కరించారు. అనంతరం ఐపీఎస్ అధికారుల సతీమణులు, పోలీస్ కార్యాలయ మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. కోలాటాలతో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో..: బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే పోలీస్ డీజీపీ కృష్ణప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వారి కుటుంబీకులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు.