సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసులతో దాడిచేయిస్తున్న సీఎం కేసీఆర్ సమస్యపై నోరెందుకు విప్పడం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. గాంధీభవన్లో సోమవారం ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులు శాంతియుతంగా తమ న్యాయమైన హక్కులకోసం ఉద్యమిస్తుంటే పోలీసులతో విచక్షణా రహితంగా లాఠీలతో ఎలా కొట్టిస్తారని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని మంత్రి హరీశ్రావు అబద్ధాలు చెబుతున్నాడన్నారు. నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. మంగళవారం తమ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో మల్లన్నసాగర్’ చేపట్టామని, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని భట్టి పిలుపునిచ్చారు.