అధ్వానంగా బీసీ హాస్టళ్లు

14 Jan, 2016 04:34 IST|Sakshi

సర్కారు చేయించిన సర్వేలో వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: ‘బీసీ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయి... ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలతో పోలిస్తే బీసీ హాస్టళ్లు వెనకబడ్డాయి. హాస్టళ్లతో పోలిస్తే రెసిడెన్షియల్ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి...’ అని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక సర్వే చేయించింది. హాస్టళ్లలో విద్యార్థుల హాజరు శాతం, గత ఏడాది అమల్లో పెట్టిన సన్న బియ్యం పథకం, విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం, విద్యా ప్రమాణాలు, హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్తు, నిర్వహణ, మౌలిక సదుపాయాలన్నింటిపైనా అధ్యయనం చేయించింది.

రెండ్రోజుల కిందటే రాష్ట్ర ప్రణాళికా విభాగం అధికారులు ఈ సర్వేలో గుర్తించిన ప్రధానాంశాలతో పాటు సమగ్ర నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల పరిధిలో రాష్ట్రంలో మొత్తం 1,394 హాస్టళ్లు ఉన్నాయి. వీటితోపాటు సగం ప్రభు త్వ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం సర్వే చేయిం చింది. హాస్టళ్లతో పోలిస్తే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలున్నాయనే దృక్పథంతో రెండింటినీ సర్వేకు ఎంచుకుంది. రాష్ట్ర ప్రణాళికా విభాగం.. సెంటర్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ అనే సంస్థతో సర్వే చేయించింది. బీసీ హాస్టళ్ల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లనే తారతమ్యం లేకుండా సమీకృత హాస్టళ్లను నెలకొల్పితే ఎలా ఉంటుంది..? అనే కోణంలోనూ ఈ సంస్థ అధ్యయన ఫలితాలను వెల్లడించినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు