దేశంలో బీర్ల వినియోగం రాష్ట్రంలోనే ఎక్కువ
రెండో స్థానంలో ఏపీ
సాక్షి, హైదరాబాద్: బీర్ల వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో 47 లక్షల కేసుల విక్రయాలు జరగ్గా.. సగటున రోజుకు 1.56 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజుకు రూ.17 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా.
అంచనాలకు మించి డిమాండ్ పెరగడంతో బీర్ల ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన టీఎస్బీసీఎల్.. పక్క రాష్ట్రాల నుంచి రోజుకు 45 వేల కేసుల చొప్పున దిగుమతి చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ మన తరువాత స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 17 శాతం అధికంగా విక్రయాలు జరిగినట్లు టీఎస్బీసీఎల్ నివేదికలు చెబుతున్నాయి.
అయితే, బార్లు, పబ్లకు వెళ్తున్న యువతరంలో 60 శాతం మంది టీనేజ్ యువతే అని తేలడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులిచ్చే పాకెట్మనీతో యువత జల్సా చేస్తున్నట్లు తేలిందని.. దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ‘పిల్లలు ఎటు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో’నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.