వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషిచేస్తానన్నారు: భూమన కరుణాకరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: సినీ దిగ్గజం దాసరి నారాయణరావు మరణం సినీ, రాజకీయరంగాలకు తీరని లోటని, ముఖ్యంగా తమను కుంగదీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ దాసరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో కలసి దాసరి నారాయణరావును రెండుసార్లు కలుసుకున్నట్టు భూమన తెలిపారు.
మనస్ఫూర్తిగా జగన్ను ఆశీర్వదిస్తూ... నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని దాసరి చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతేకాదు 2017 చివరినాటికి వైఎస్సార్సీపీలో బేషరతుగా చేరతానని, 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా తిరిగి జగన్ గెలుపుకోసం ప్రచారం చేస్తానని దాసరి తమతో అన్నారని భూమన తెలిపారు. ఈ నెల 4న దాసరి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినపుడు కూడా ఆయన ఆత్మీయంగా మాట్లాడి ఆశీర్వదించారన్నారు. ఇంతలోనే దాసరి మృత్యుఒడికి చేరుకోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆయన మృతి వైఎస్సార్ కాంగ్రెస్కూ తీరని లోటని పేర్కొన్నారు.