‘పేకాట’ పైనా పీడీ యాక్ట్!

15 Dec, 2015 00:08 IST|Sakshi
‘పేకాట’ పైనా పీడీ యాక్ట్!

మోసం కోణాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్
నిర్వాహకులపై చీటింగ్ కేసుల నమోదు
పీడీ యాక్ట్ ప్రయోగానికీ అవకాశం
రంగం సిద్ధం చేస్తున్న ఎస్బీలోని {పత్యేక సెల్

 
సిటీబ్యూరో:   నగరంలో పేద, మధ్య తరగతి కుటుంబాలను కూలుస్తున్న పేకాటపై ఉక్కుపాదం మోపడానికి సిటీ కాప్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ శిబిరాలను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటి వరకు అవకాశం చిక్కలేదు. దీంతో లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ‘మోసం’ కోణం గుర్తించారు. దీని ఆధారంగా కీలక వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సిటీలో ఒకప్పుడు దాదాపు 15 వరకు ప్రముఖ, అనుమతులు ఉన్న క్లబ్బులు ఉండేవి. వీటివల్ల జరుగుతున్న దారుణాలు, కూలిపోతున్న కుటుంబాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం పేకాట క్లబ్బుల్ని బ్యాన్ చేసింది.

మొదలైన స్థానిక ‘శిబిరాలు’...
నగరంలోని క్లబ్బులు మూతపడటంతో పేకాటరాయుళ్లు ప్రత్యామ్నాయాల కోసం వెతికారు. ఇలాంటి వారి బల హీనతల్ని క్యాష్ చేసుకోవడానికి స్థానికంగా పేకాట శిబి రాలు పట్టుకొచ్చాయి.  ఒకప్పుడు క్లబ్బులకు వెళ్లి ఆడినవాళ్లు, పేకాటరాయుళ్లతో పరిచయం ఉన్న వ్యక్తులు తమ ఇళ్లు, పరిచయస్తుల ప్రాంగణాలను మినీ క్లబ్బులుగా మార్చేశారు. గరిష్టంగా పది మంది పరిచయస్తులు, వారి ద్వారా వచ్చే వారికి ‘ఆశ్రయం’ ఇస్తూ పేకాట ఆడిస్తున్నారు. ఇలాంటి వాటికి  వెళ్తున్నది, బలవుతున్నది ఎక్కువగా పేద, దిగువ మధ్య తరగతి వారే. సాధారణ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ వంటి ప్రత్యేక బృందాలు సైతం సమాచారం అందినప్పుడల్లా దాడులు చేసి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్న వారినీ అరెస్టు చేస్తున్నాయి.
 
మోసం’.....
పేకాట ఆడుతూ చిక్కిన, శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటి వరకు పోలీసులు గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, వారికి తేలిగ్గా బెయిల్ దొరకడంతో ప్లేసులు మార్చి మళ్లీ తమ పంథా కొనసాగి స్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్తేనే పేకాట శిబిరాల కు అడ్డుకట్ట వేయొచ్చని  భావించిన టాస్క్‌ఫోర్స్ పోలీ సు లు పలు కేసుల్ని లోతుగా పరిశీలించారు. ఈ నేపథ్యం లోనే నిర్వాహకుల మోసం కోణం వెలుగులోకి వచ్చింది. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారు పేకాట రాయుళ్లను ఆకర్షిస్తున్నప్పుడు ఉచితంగా ఆడుకోమని చెప్పి.. ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని,   తమ వద్ద పెట్టుకుని ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు పేకాటరాయుళ్లపై నమోదు చేస్తున్న మాది రి గానే నిర్వాహకుల పైనా గేమింగ్ యాక్ట్ కింద కేసు నమో దు చేయడంతో పాటు చీటింగ్  సెక్షన్‌ను జోడిస్తున్నారు.
 
పీడీ యాక్ట్ ప్రయోగానికి అవకాశం...
 ఇటీవల బంజారాహిల్స్ పరిధిలోని కమలాపురి కాలనీ లో, ఆదివారం లంగర్‌హౌస్ పరిధిలో పట్టుబడిని రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ చేర్చారు. ఈ రెండింటిలోనూ నిర్వాహకులుగా ఉన్న నాగేంద్రబాబు, అంజద్ అహ్మద్ ఖాన్‌లపై ఈ ఆరోపణలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు అయిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం లేదు. అయితే ఈ రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ నమోదుతో ఆ అవకాశం ఏర్పడింది.
 
దీంతో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి అవసరమైన సన్నాహాలను స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని పీడీ సెల్ చేస్తోంది. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే స్థాని కంగా వెలుస్తున్న పేకాట శిబిరాలను కట్టడి చేయొచ్చని, అప్పుడే అనేక కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు