బీజేపీ నాలుగు నెలల కార్యాచరణ

18 May, 2017 02:03 IST|Sakshi
బీజేపీ నాలుగు నెలల కార్యాచరణ

- క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రణాళిక
- 50 లక్షల కుటుంబాలను కలిసేలా వ్యూహం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి నాలుగు నెలల కార్యాచరణ ప్రణాళికను బీజేపీ విడుదల చేసింది. పార్టీ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకుని పోలింగ్‌ బూత్‌ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా సైద్ధాంతిక అంశాలు, పార్టీ బలోపేతం, సమస్యలపై పరిశీలన, కిందిస్థాయి వరకు కేంద్ర పథకాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ శ్రేణులకు శిక్షణ వంటివి విస్తృతంగా చేపట్టనుంది. ఈ దిశలో సెప్టెంబర్‌ 25 వరకు రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలను పార్టీ కార్యకర్తలు స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో ఆయా అంశాల పరిశీలనకు చర్యలు తీసుకోనున్నారు.

సెప్టెంబర్‌ 25 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని బీజేపీ ఉపాధ్యక్షుడు, దీన్‌దయాళ్‌ సంచాలన సమితి ఇన్‌చార్జ్‌ టి.రాజేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, సుధాకర శర్మతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమకు ఎదురులేదనే టీఆర్‌ఎస్‌ అహంకార ధోరణి, కేసీఆర్‌ కుటుంబపాలనకు చెక్‌ పెట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ కార్యాచరణను రూపొందించిందని చెప్పారు.

ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలను ఉద్యమాలు చేయొద్దనడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా దీన్‌దయాళ్‌ ఆదర్శ జీవితం, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు, కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయం, తదితర వివరాలను బ్రోచర్ల ద్వారా 50 లక్షల కుటుంబాలకు తెలియజేస్తామన్నారు. కార్యవిస్తారక్‌ యోజనలో భాగంగా ఈనెల 29 నుంచి జూన్‌ 12 వరకు రాష్ట్రంలోని 32 పోలింగ్‌బూత్‌లలో 10 వేల మంది విస్తారక్‌లు పర్యటిస్తారని ఈ కార్యక్రమ ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి మొదలుకుని కిందిస్థాయి వరకు 15 రోజుల పాటు తమకు కేటాయించిన జిల్లాల్లో పనిచేస్తారన్నారు.

మరిన్ని వార్తలు