రాజకీయ అవినీతికి మారుపేరు కాంగ్రెస్: బూర

4 Nov, 2016 02:06 IST|Sakshi
రాజకీయ అవినీతికి మారుపేరు కాంగ్రెస్: బూర

సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుని, దాచుకునే సంస్కృతి కాంగ్రెస్ నరనరాల్లో జీర్ణించుకుపోయిందని, రాజకీయ అవినీతికి ఆ పార్టీ మారుపేరని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. పచ్చ కామెర్ల రోగుల్లా మారిన కాంగ్రెస్ నేతలు తమ హయాంలో జరిగినట్లే ఇప్పుడు కూడా అవినీతి జరుగుతోందని భ్రమపడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా, మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

కేసీఆర్ ప్రజారంజక పాలనతో బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు ఏమీ పాలుపోక ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశానికి రాజకీయ రంగు పులిమిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా కమిటీల నియామకంలో మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వారికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు