హైదరాబాద్: మలక్ పేట శంకర్ నగర్ లో విషాదం నెలకొంది. మూసీ నదిలో తరుణ్(7) అనే ఓ బాలుడు గల్లంతయ్యాడు. శంకర్ నగర్ బస్తీ మూసి నదికి పక్కనే ఉండటంతో అక్కడే తన ఇంటి వద్ద ఆడుకుంటూ వెళ్లిన తరుణ్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఉదయం నుంచి ఎంత వెతికినా బాబు ఆచూకీ లభించలేదు.
గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా స్ధానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించి ఆలస్యం చేశారు. ఉదయం నుంచి స్పందించని అధికారులు సాయంత్రంపూట మాత్రం బోటుతో వచ్చి మూసీలో గాలింపులు మొదలుపెట్టారు. బంతికోసం వెళ్లిన బాలుడు దానిని తీసే క్రమంలో కాలు జారీ అందులో పడి కొట్టుకుపోయాడని అతడి తల్లి వాపోయింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బంధువుల రోధనలు మిన్నంటాయి.